సిద్దిపేట అర్బన్, జూన్ 30 : సర్కారు పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఓ వైపు ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంతో సకల సౌకర్యాలు కల్పిస్తూనే, మరోవైపు పాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపర్చేలా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలకు ట్యాబ్లను పం పిణీ చేస్తున్నది. గతంలో పాఠశాల సమాచారాన్ని ఆన్లైన్ చేయాలంటే కాంప్లెక్స్, నెట్ సెంటర్లకు వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారడంతో వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం ట్యాబ్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు ట్యాబ్లను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని పాఠశాలలకు ట్యాబ్ల పంపిణీ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. సమాచారాన్ని పొందుపర్చడమే కాకుండా డిజిటల్ విద్యాబోధనకు సైతం ఈ ట్యాబ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
జిల్లాలో ఉన్న 630 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రభుత్వం ట్యాబ్లను అందజేసింది. ఆన్లైన్లో వివరాలు పొందుపర్చడం ఉపాధ్యాయులకు కొంత ఇబ్బందిగా ఉండేది. అయితే ఇక నుంచి పాఠశాలకు సం బంధించిన పలు అంశాలను ట్యాబ్లోనే పొందుపర్చనున్నారు. విద్యార్థుల అడ్మిషన్లు, విద్యార్థి సం బంధించిన పూర్తి బయోడేటా, యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, విద్యార్థుల హాజరుశాతం, ఉపాధ్యాయుల హాజరుశాతం, మార్కుల లిస్ట్, నెలవారీ పాఠశాల పనిదినాలు, యూడైస్ వివరాలు, మధ్యాహ్న భోజనం సంబంధించిన వివరాలు, మౌలిక వసతులు, విద్యాశాఖ అమలుచేస్తున్న వివిధ కార్యక్రమాలు, తదితర విషయాలన్నింటినీ ఇక నుంచి ట్యాబ్లోనే ఆన్లైన్ చేయనున్నారు. నంగునూరు మండలంలో అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ట్యాబ్ల పంపిణీ చేశారు. శుక్రవారం నంగునూరు మండల కేంద్రంలో మండల వనరుల కేంద్రం కోఆర్డినేటర్ రజిత, సీఆర్పీ మోహన్బాబుతో కలిసి జేపీ తండా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణతో పాటు పలువురికి ట్యాబ్లు పంపిణీ చేశారు.