బొల్లారం, జనవరి 5 : స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో బొల్లారం మున్సిపాలిటీకి అవార్డు లభించింది. నగరంలో గురువారం జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బొల్లారం మున్సిపాలిటీకి ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ హోదా అవార్డును మున్సిపల్ కమిషనర్ రాజేంద్రకుమార్ అందుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలను చేపడుతూ మున్సిపాలిటీ ర్యాంక్ను మెరుగుపరుచుకుంటూ అవార్డును సాధించడంపై కమిషనర్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. అవార్డు పొందిన సందర్భంగా మంత్రి కేటీఆర్ తనను అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని అందించినట్లు ఆయన చెప్పారు.
అవార్డు రావడం సంతోషకరం…
స్వచ్ఛ సర్వేక్షణ్లో బొల్లారం మున్సిపాలిటీకి అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయమని, ఇది మున్సిపల్ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతోనే సాధ్యమైందని చైర్పర్సన్ రోజాబాల్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తూప్రాన్కూ అవార్డు
తూప్రాన్, జనవరి 5 : ఇంటింటా చెత్త సేకరణ, శౌచాలయాల నిర్వహణ తదితర అంశాల్లో వంద శాతం లక్ష్యం సాధించినందుకు తూప్రాన్ మున్సిపాలిటీకి ఓడీఎఫ్ డబుల్ ప్లస్ అవార్డు వచ్చిందని మెదక్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. రాష్ట్రంలో పట్టణ ప్రగతి పురోగతిపై గురువారం హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ సమీక్షించి దిశానిర్దేశం చేశారని ఆమె తెలిపారు. ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సర్టిఫికెట్లను రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి కె.తారకరామారావు ప్రదానం చేశారని ఆమె తెలిపారు. తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్, కమిషనర్ మోహన్ హర్షం వ్యక్తం చేశారు.