వెల్దుర్తి, ఫిబ్రవరి 26: ఫార్మా విలేజ్ కోసం మాసాయిపేట మండలంలోని పలు గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను మెదక్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. రామంతాపూర్ పరిధిలో 324, అచ్చంపేటలో 430.25, హక్కీంపేటలో 162.14 ఎకరాలను గుర్తించిన మండల రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులకు నివేదికలు సమర్పించడంతో సోమవారం తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, భూగర్భ వనరుల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, టీఎస్ఐఐసీ శాఖల అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఈ భూములకు దగ్గరగా ఉన్న హల్దీ ప్రాజెక్టును సైతం సందర్శించి, భవిష్యత్తులో ప్రాజెక్టుకు ఏమైనా ఇబ్బందులు వస్తాయా అని చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు మాసాయిపేట మండలంలో ఉన్న భూములను పరిశీలించామని, మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జ్ఞానజ్యోతి, ఆర్ఐ ధన్సింగ్, సర్వేయర్ నర్సింహులు, సిబ్బంది ఉన్నారు.