హుస్నాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ రాకముందు ప్రాజెక్టుల నిర్మాణం జరగక పోవడంతో వేలాది టీఎంసీల కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోయేవని, జలాలను సద్వినియోగం చేసి రాష్ట్రంలోని రైతాంగానికి, ప్రజలకు సాగు, తాగునీరందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఆదివారం జరగనున్న సీఎం కేసీఆర్ తొలి ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో కలిసి శనివారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ ఆరున్నర దశాబ్దాల్లో జరగని అభివృద్ధిని పదేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు.
గోదావరి నదిపై కేవలం పోచంపాడు ప్రాజెక్టు మాత్రమే ఉండేదని, తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే నదిపై ఆరు ప్రాజెక్టులను నిర్మించి పాతాళంలో ఉన్న గోదారమ్మను పైకి తెచ్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఎడారి జిల్లాలను పచ్చని జిల్లాలుగా మార్చడం, పుష్కలంగా పంటలు పండించుకునే అవకాశం కల్పించారన్నారు. విద్య, వైద్య రంగాల్లోనూ రాష్ట్రం నంబర్వన్గా నిలిచిందన్నారు. 33మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 10వేల మంది వైద్యులను తయారు చేస్తున ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. 2014కు ముందు కేవలం 7,500ల మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అయ్యేదని, ప్రస్తుతం 26వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకొని 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 1.30లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
మూడోసారి కేసీఆర్ను సీఎంగా చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. హుస్నాబాద్లో జరగనున్న తొలి ప్రజా ఆశీర్వాదసభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని, లక్ష మందితో సభను విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే అభ్యర్థుల సమావేశంలో బీఫామ్లు అందజేసి అనంతరం సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను ప్రకటిస్తారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. పదేండ్ల పాటు ప్రజారంజక పాలన అందించిన సీఎం కేసీఆర్ ప్రజలకు ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోను ప్రకటిస్తారని చెప్పారు. హుస్నాబాద్లో మూడోసారి కూడా ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించడం హర్షణీయమని, సభను విజయవంతం చేసేందుకు పార్టీ క్యాడర్ నిరంతరంగా పనిచేస్తున్నదన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఇక్కడి ప్రజలందరికీ తెలుసునని, ఎక్కడి నుంచో వచ్చిన వారికి ఇక్కడి అభివృద్ధి ఎలా కనబడుతుందని హెద్దేవ చేశారు.
ఇప్పటికే నియోజకవర్గంలో 68వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నామని, గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తి చేశామన్నారు. హుస్నాబాద్ పట్టణాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశామని, గ్రామాల్లోనూ అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధే మూడోసారి గులాబీ జెండాను నిలబెడుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ రాజిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, కర్ర శ్రీహరి, పేర్యాల రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్చైర్పర్సన్, ఎంపీపీలు మానస, మాలోతు లక్ష్మీ, జడ్పీటీసీ భూక్యా మంగ, ఎన్ఎల్సీఎఫ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, నాయకులు ఎడబోయిన తిరుపతిరెడ్డి, వెంకట్రామ్రెడ్డి, అన్వర్, మహేందర్, ఆకుల వెంకట్, కొక్కుల సురేశ్, శ్రీకాంత్, బీలూనాయక్, పరశురామ్, బండి పుష్ప, క్రాంతిరెడ్డి, రమేశ్నాయక్, కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.