నర్సాపూర్,జూన్ 1: మంత్రులు, అధికారుల మధ్య సమన్వయలోపంతోనే ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరుగుతున్నదని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు అలాగే ఉన్నాయని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని స్వగృహంలో సోమవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. రబీ సీజన్లో వచ్చే ధాన్యంపై ప్రభుత్వం అంచనా వేసి అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయడంతో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
సమస్యలు పరిష్కరించాల్సిన మంత్రులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. లారీలు రాక ,బస్తాలు లేక లోడింగ్, అన్లోడింగ్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.
చిలిపిచెడ్ మండలంలోని ఫైజాబాద్, చండూర్, గౌతాపూర్, చిలిపిచెడ్, వెల్దుర్తి మండలంలో హకీంపేట్, మాసాయిపేట్, ఉప్పులింగాపూర్, నర్సాపూర్ మండలంలో హైమ్మద్నగర్, జక్కపల్లి, కౌడిపల్లి మండలంలో ధర్మసాగర్, నాగ్సాన్పల్లి, సలాబత్పూర్ తదితర గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నహిమొద్దీన్, మాజీ ఎంపీటీసీ సత్యంగౌడ్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, కౌన్సిలర్లు కండుల రాజు, మోహిజొద్దీన్, నాయకులు రింగుల ప్రసాద్, మహ్మద్, ఆనంద్కుమార్, రాకేశ్గౌడ్, వినయ్ పాల్గొన్నారు.