నర్సాపూర్ నియోజకవర్గంలో మరోసారి గులాబీజెండా ఎగరాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. ఆదివారం నర్సాపూర్లోని చాముండేశ్వరి గార్డెన్లో నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు ఎన్నికల శంఖారావాన్ని పూరించి మాట్లాడుతూ.. నర్సాపూర్ పార్టీ కార్యకర్తలు టికెట్ విషయంలో గొప్ప స్ఫూర్తిని చాటారని, అధిష్టానం సునీతాలక్ష్మారెడ్డికి టికెట్ ప్రకటించగా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సునీతాలక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే మదన్రెడ్డిపై బాధ్యత పెట్టారన్నారు. మెదక్ ఎంపీగా ఎమ్మెల్యే మదన్రెడ్డిని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు. మనందరిదీ బీఆర్ఎస్ కుటుంబమని, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
నర్సాపూర్/శివ్వంపేట, అక్టోబర్ 29: నర్సాపూర్ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దామని, మనందరిదీ బీఆర్ఎస్ కుటుంబమని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం నర్సాపూర్లోని చాముండేశ్వరి గార్డెన్లో నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్రావు హాజరై ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నర్సాపూర్ పార్టీ కార్యకర్తలు టికెట్ విషయంలో గొప్ప స్ఫూర్తిని చాటారని, అధిష్టానం సునీతాలక్ష్మారెడ్డికి టికెట్ ప్రకటించగా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి మద్దతు తెలిపినందుకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సునీతాలక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే మదన్రెడ్డిపై బాధ్యత పెట్టారన్నారు. మెదక్ ఎంపీగా ఎమ్మెల్యే మదన్రెడ్డిని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటున్నానని సభాముఖంగా తెలిపారు. రైతుబంధును అడ్డుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గంటలే కరెంట్ ఇస్తున్నదన్న నిజాన్ని ఒప్పుకున్నారన్నారు. ఈ దెబ్బతో తెలంగాణలో కాంగ్రెస్కు సమాధి కట్టడం ఖాయమని, నిజం చెప్పినందుకు డీకే శివకుమార్కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
కార్యకర్తలందరిది
బీఆర్ఎస్ పార్టీలో ఉండే మనందరిదీ ఒకే కుటుంబమని, ఇందులో ఎలాంటి వర్గాలు లేవని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మదన్రెడ్డి చేతుల మీదుగా బీఫాం తీసుకున్నందుకు ఎంతో అదృష్టవంతురాలిగా భావిస్తున్నానన్నారు. బీఫాం అందజేసినందుకు సీఎం కేసీఆర్కు, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, ఎమ్మెల్యే మదన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మదన్రెడ్డికి, నాకు అన్నాచెల్లెళ్ల అనుబంధం అని, ప్రచారంలో ఇద్దరం కలిసి తిరుగుతామన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి నర్సాపూర్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వెంకట్రామ్రెడ్డి, లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు రాజుయాదవ్, వెంకటరాంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమోద్దిన్, జిల్లా ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యుడు పబ్బ మహేశ్గుప్తా, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ, బీఆర్ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, తొంట వెంకటేశ్, లలిత, పైడి శ్రీధర్గుప్తా, అశోక్గౌడ్, షేక్ హుస్సేన్, నర్సింలు, సంతోష్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శశిధర్రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారంతో నర్సాపూర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. నర్సాపూర్ టికెట్ విషయంలో కేసీఆర్ పిలిపించి మెదక్ ఎంపీగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఆర్టీసీ డిపో, చెక్డ్యాంలు, ఫోర్లేన్ రోడ్డు తదితర అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. తాను పార్టీ మారుతానని అసత్య ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే నర్సాపూర్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ చొరవతో మంత్రి హరీశ్రావు సహకారంతో కాళేశ్వరం నీరు తీసుకొచ్చి ప్రతి ఎకరానికి అందిస్తామన్నారు. సునీతాలక్ష్మారెడ్డికి బీఫాం ఇచ్చిన రోజే తను గెలిచిపోయిందని ప్రకటించుకున్నానని, సునీతాలక్ష్మారెడ్డి గురించి ఎవరు అపోహలు పడొద్దన్నారు. గతంలో పార్టీలు వేరు అని, నేడు అందరం ఒకటే పార్టీ అని తెలిపారు. గతం మరిచిపోయి అందరు ఏకమై సునీతాలక్ష్మారెడ్డి విజయానికి పాటుపడాలని కార్యకర్తలకు సూచించారు. నర్సాపూర్లో ప్రతిపక్ష పార్టీలకు దమ్ములేదని, ఎన్నికలు అయ్యేంతవరకు నర్సాపూర్ వదిలి ఎక్కడకూ వెళ్లనని తెలిపారు. అందరం కలసికట్టుగా సునీతాలక్ష్మారెడ్డి విజయానికి పాటుపడుదామని అన్నారు.
రూ.200 ఉన్న పింఛన్ను సీఎం కేసీఆర్ రూ.2,000 చేసి లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు నింపారని మంత్రి హరీశ్రావు అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే పింఛన్ను రూ.5000 చేస్తామని సీఎం వెల్లడించారన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.3 వేలు, రూ.400కే గ్యాస్, రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం, రైతుబీమా తరహా కేసీఆర్ బీమా పథకం, ఆరోగ్యశ్రీ రూ.15 లక్షలకు పెంపు, రైతుబంధు రూ.16 వేలకు పెంచేందుకు సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో రూపొందించారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నర్సాపూర్ నియోజక వర్గానికి మూడు వేల ఇండ్లు మంజూరు చేస్తానని హామీఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అసైన్డ్ భూములకు పట్టాలు అందజేస్తామన్నారు. ఇప్పటికీ రూ.14వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని, మరో నాలుగు వేల కోట్లు ఇచ్చేది ఉన్నదన్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి ఇస్తే ఆ డబ్బులు కూడా రైతులకు చెల్లిస్తామన్నారు. సీఎం కేసీఆర్ తంటాలు లేకుండా కాంటాలు పెట్టించారని, పండిన ధాన్యాన్ని రైతులు విక్రయించి మద్దతు ధర పొందుతున్నారన్నారు. బీఆర్ఎస్ నుంచి బరిలో నిలబడిన సునీతాలక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు.
నర్సాపూర్, అక్టోబర్ 29: శివ్వంపేట మండలం రెడ్యాతండా, పిల్లుట్ల, లింగోజిగూడ గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది వివిధ పార్టీల కార్యకర్తలు రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, పార్టీ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి సమక్షంలో నర్సాపూర్ సభలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి హరీశ్రావు కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కంకణబద్ధులు కావాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు.