జహీరాబాద్, జనవరి 9: జహీరాబాద్ ప్రాంతం చెరుకు సాగుకు పెట్టింది పేరు. 1972-73లో కొత్తూర్(బి) గ్రామంలో నిజాం చక్కెర ఫ్యాక్టరీని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రోజుకు 1250 టన్నుల చెరుకు క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఫ్యాక్టరీ జోన్ పరిధిలో జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్, మనూర్, రేగోడ్ మండలాలను తీసుకొచ్చారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు మంచిగానే నడిచింది. కార్మికుల సమస్య, యాజమాన్యం కొత్త యంత్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రతి ఏడాది క్రషింగ్లో సమస్య రావడంతో ఫ్యాక్టరీ నష్టాల్లోకి వెళ్లింది. దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి నష్టాలపై విచారణకు ఆదేశించింది. కొత్తూర్(బి) గ్రామంలో ఫ్యాక్టరీకి 110 ఎకరాల భూమి ఉండేది.
విచారణ కమిటీ నివేదికతో 2002లో నిజాం చక్కెర ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసింది అప్పటి ప్రభుత్వం. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కావడంతో చెరుకు రైతులకు కష్టాలు మొదలయ్యాయి. నిజాం చక్కెర ఫ్యాక్టరీ ప్రస్తుతం ట్రైడెంట్ కర్మాగారంగా కొనసాగుతున్నది. ట్రైడెంట్ యాజమాన్యం రెండేండ్లుగా నష్టాల పేరుతో విలువైన ఫ్యాక్టరీ భూముల ను అమ్ముతున్నది. కేసీఆర్ ప్రభు త్వం ఫ్యాక్టరీపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి, ఆస్తులు వేలం వేసి రైతులకు బకాయిలు చెల్లించింది. కాగా, 2022-23లో క్రషింగ్ చేసిన రైతులకు ఇప్పటివరకు రూ. 9 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీంతో ఫ్యాక్టరీ ఆస్తులు వేలం వేసేందుకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో యాజమాన్యం కోర్టుకు పోవడంతో సమస్యగా మారిపోయింది. ఈనెల 20న కోర్టు తీర్పు వస్తుందని చెరుకు అభివృద్ధి అధికారులు తెలుపుతున్నారు.
జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో పరిధిలో 11 వేల హెక్టార్లలో చెరుకు పంటను రైతులు సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గతంలో ఫ్యాక్టరీ యాజమాన్యం చెరుకు పం టను అగ్రిమెంట్ చేసుకొని బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించే వారు. కొందరు రైతులు చెరుకు పంటను సాగు చేసిన చెక్కెర కర్మాగారానికి అగ్రిమెంట్ చేయరు. క్రషింగ్ సీజన్లో ఎక్కడ ఎక్కువ ధర ఉంటే ఆ పరిశ్రమకు చెరుకును తరలిస్తారు. ఒక ఎకరా చెరుకును పొలంలో సాగు చేయాలంటే రైతు రూ.50 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎరువుల ధరలు, కూలీ ఖర్చులు సైతం పెరిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జహీరాబాద్ చెరుకు రైతులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ట్రైడెంట్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రైతులకు మద్దతు ధర ఇప్పిస్తామన్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచినా ఇంతవరకు చెరుకు రైతుల పెండింగ్ బిల్లులను ట్రైడెం ట్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించలేదు.
చక్కెర ఫ్యాక్టరీలు అమ్మకాల్లో లాభాలను రైతులకు పంచాలి, కానీ ఎక్కడా అమలుకావడం లేదు. చెరుకు గానుగతో వచ్చే వ్యర్థ పదార్థాలు, మొలాసిస్, బెగాస్కు మార్కెట్లో మంచి ధర ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెపుతున్నారు. ఈ వ్యర్థాల ధరకు సమానమైన ధర తమకు ఇవ్వాలని చెరుకు రైతులు డిమాండ్ చేసినా యాజమాన్యం రైతులకు ఎలాంటి లాభాలు ఇవ్వడంలేదు. కేంద్రం ప్రకటించే మద్దతుధర పూర్తి గా పరిశ్రమ యజమానులకు అనుకూలంగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 40-50 టన్నుల దిగుబడి వస్తుంది. చెరుకు ఏడాది పంట. ఏడాదిలో రెండు సార్లు సాగు చేస్తారు. ఒక ఎకరా చెరుకు పంట సాగు చేయాలంటే రైతులు రూ.50 వేల వరకు ఖర్చు చేస్తారు. చక్కెర ఫ్యాక్టరీలు రైతులకు ఇచ్చే మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2022-23 సీజన్లో 10.97 శాతం రికవరీపై రూ.3,269 టన్నుకు మద్దతు ధర ప్రకటించారు.