మెదక్, మే 6 (నమస్తే తెలంగాణ): పౌర సరఫరాల శాఖకు పెండింగ్ ఉన్న 36,527 మెట్రిక్ టన్నుల సీఏంఆర్ ధాన్యాన్ని మరాడించి లక్ష్యం మేరకు పక్షం రోజుల్లో బియ్యాన్ని గోదాములకు తరలించాలని రారైస్ మిల్లర్లను ఆదేశించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షాను రాష్ట్ర ముఖ్యకార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఇందుకు సంబంధించి రోజూ రైస్ మిల్లులను సందర్శించి పర్యవేక్షించాలని తహసీల్దార్లను ఆదేశించమని తెలిపారు. శనివారం కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, సీఎంఆర్ రైస్, ధాన్యం కొనుగోళ్లు, జీవో 58, 59 కింద ఇళ్ల పట్టాలు, క్రమబద్ధీకరణ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్ ఇళ్ల పంపిణీ వివరాలు ఆన్లైన్ నమోదు, రసాయన ఎరువులు, తదితర అంశాలపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జిల్లాలో కంటివెలుగు, ఆరోగ్య మహిళా కేంద్రాలను పటిష్టవంతంగా నిర్వహిస్తున్నందున మంచి స్పందన లభిస్తున్నదన్నారు. ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో 3,83,414 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 41,586 మందికి రీడింగ్ అద్దాలు, 33,333 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ఆరు ఆరోగ్య మహిళా కేంద్రాల ద్వారా 3,852 మందిని పరీక్షించి, 1,456 మందికి డయాగ్నాస్టిక్ పరీక్షలు నిర్వహించామన్నారు. దీనిపై సీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. జీవో 58, 59 కింద అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకుండా విస్తృత ప్రచారం కల్పిస్తూ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన బిల్లులను సత్వరమే చెల్లించేందుకు చొరవ చూపాలన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటివెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించి, పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే విషయంలో జాప్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి చందునాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి, డీపీవో సాయిబాబా, కలెక్టరేట్ ఏవో యూనూస్, బలరాం తదితరులు పాల్గొన్నారు.