సిద్దిపేట, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డ.. బీఆర్ఎస్కు కంచుకోట అని మరోసారి నిరూపించింది. ఆదివారం విడుదలైన అసెంబ్లీ ఫలితాల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. జిల్లాలో పది శాసనసభ స్థానాలకు ఏడు చోట్ల ఘనవిజయం సాధించింది. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా ఇక్కడ మాత్రం ఆ హవా పని చేయలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీశ్రావు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత (2014, 2018లో) జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఆధిక్యతను కనబర్చింది. ఉమ్మడి జిల్లాలో 10 శాసనసభ స్థానాలకు (2014లో) 8 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగా, జహీరాబాద్, నారాయణఖేడ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. 2018 ఫలితాల్లో 10 శాసనసభ స్థానాలకు తొమ్మిది చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. సంగారెడ్డిలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. తాజాగా జరిగిన 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏడు స్థానాలు గెలుపొందగా కాంగ్రెస్ మూడు చోట్ల విజయం సాధించింది. ఎన్నికలు ఏవైనా అది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటే అని ఇక్కడి ప్రజలు నిరూపించారు.
ఉద్యమాల పురిటిగడ్డ..బీఆర్ఎస్ కంచుకోట ఉమ్మడి మెదక్ జిల్లా .. ఆదివారం శాసనసభ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మరోసారి బీఆర్ఎస్ తన సత్తా చాటుకుంది. పది శాసనసభ స్థానాలకు ఏడు చోట్ల ఘన విజయం సాధించింది. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోట అని రుజువు చేశారు. రాష్ట్రం అంతా కాంగ్రెస్ గాలి వీచినా ఇక్కడ మాత్రం ఆ హవా పనిచేయలేదు. ఎన్నికలు ఏవైనా అది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటే అని ఇక్కడి ప్రజలు నిరూపించారు. బీఆర్ఎస్ ఆవిర్భవించిన నాటి నుంచి పార్టీకి వెన్నంటే ఇక్కడి ప్రజలు ఉంటున్నారు. అవి శాసనసభ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా అన్నింటిలోనూ బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కడుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీశ్రావు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఈ జిల్లాకు ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకు తగ్గట్టుగానే ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. బీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అనేక విజయాలను అందించింది మెతుకు గడ్డ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014, 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఆధిక్యతను కనబర్చింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 శాసనసభ స్థానాలకు 2014లో 8 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోగా, జహీరాబాద్, నారాయణ్ఖేడ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే అనారోగ్య కారణంతో మరణించగా అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డి గెలుపొందారు. దీంతో 10కి తొమ్మిది చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక 2018 ఎన్నికల ఫలితాల్లో 10 శాసనసభ స్థానాలకు తొమ్మిది చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఒక్క సంగారెడ్డిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అది కూడా ట్రక్కు గుర్తు ప్రభావంతో కాంగ్రెస్ గెలుపొందింది. తదనంతరం దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2020లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో స్పల్ప ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాగా ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు 1,079 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు జిల్లా పరిషత్లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అన్ని మండల పరిషత్లతో పాటు, గ్రామాల సర్పంచ్లు ఇలా అన్నింటా బీఆర్ఎస్ నిలిచింది. జిల్లాలో 95 శాతానికి పైగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇటీవల జరిగిన 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏడు స్థానాలు గెలుపొందగా కాంగ్రెస్ మూడు చోట్ల విజయం సాధించింది.
పదిలో ఏడు చోట్ల బీఆర్ఎస్ ఘనవిజయం
జిల్లాలోని పది శాసనసభ స్థానాలకు ఏడు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ మూడు చోట్ల విజయం సాధించింది. 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయాన్ని సొంతం చేసుకుంది. 2014లో రెండు, 2018లో ఒక స్థానం, 2023లో మూడు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది.ఎన్నికల ఫలితాలను చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని చెప్పవచ్చు. 2023 శాసనసభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే గజ్వేల్ నుంచి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టారు. గజ్వేల్లో కేసీఆర్కు 1,11,684 ఓట్లు రాగా తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కు 66,653 ఓట్లు వచ్చాయి. కేసీఆర్ 45,031 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సిద్దిపేట నుంచి ఏడో సారి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి తన్నీరు హరీశ్రావుకు 1,05,514 ఓట్లు , తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణకు 23,206 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో హరీశ్రావు 82,308 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. పైగా వరుసగా ఏడోసారి ఒకే నియోజకవర్గం నుంచి గెలుపొంది అరుదైన రికార్డును హరీశ్రావు సొంతం చేసుకున్నారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి 97,879 ఓట్లు, బీజేపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్రావుకు 44,366 ఓట్లు వచ్చాయి.
కొత్త ప్రభాకర్రెడ్డి 53,513 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు అద్భుతమైన తీర్పును ఇచ్చారు. గత ఉప ఎన్నికల్లో బీజేపీ మాటలను నమ్మి ప్రజలు ఓటు వేశారు. తిరిగి ప్రజలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సునీతాలక్ష్మారెడ్డికి 88,410 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజీరెడ్డికి 79,555 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి 8,855 ఓట్లతో విజయం సాధించారు. పటాన్చెరువు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి 1,05,387 ఓట్లు, తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్గౌడ్కు 98,296 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్రెడ్డి 7,091 ఓట్ల మెజార్టీతో విజయం సొంతం చేసుకున్నారు. ఈయన ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన చింతా ప్రభాకర్కు 82,614 ఓట్లు, తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డికి 73,317 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ 9,297 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్రావుకు 97,205 ఓట్లు, తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్కు 84,415 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మాణిక్రావు 12,790 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. వరుసగా రెండు సార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. మొత్తంగా పది శాసనసభ స్థానాల్లో ఏడు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. ఆందోల్లో దామోదర రాజనర్సింహ 28,193 ఓట్లు, నారాయణ్ఖేడ్లో పట్లోళ్ల సంజీవరెడ్డి 5,766 ఓట్లు, మెదక్లో మైనంపల్లి రోహిత్ 10,157 ఓట్ల మెజార్టీతో మూడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.