సిద్దిపేట, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 15న సమస్యలతో పునఃప్రారంభమయ్యాయి. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. పాఠశాల ప్రారంభం రోజే అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుస్తులు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో అమలు చేయలేదు. గత ప్రభుత్వం పాఠశాలలు తెరిచే నాటికి అన్ని సిద్ధం చేసి పాఠశాలల పునఃప్రారంభం రోజు అందించింది. ప్రారంభం రోజు ఒక పండుగ వాతావారణంలో జరిగేది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ఉత్సాహం ఎక్కడా కనిపించినట్లు లేదు. మరుగుదొడ్లు సరిగ్గా లేవు, తాగునీటి సమస్యలు ఉన్నాయి. భవనాలు అరకొరగానే ఉన్నాయి. కొన్ని శిథిలావస్థలో ఉండి వానలకు ఊరుస్తున్నాయి. పెచ్చులు ఊడి పోతున్నాయి. పలు పాఠశాలలకు ప్రహరీలు లేవు. మధ్యాహ్న భోజన శాలలు ఇంకా నిర్మించాల్సి ఉంది. ఇలా ఎన్నో సమస్యలు ప్రభుత్వ పాఠశాలలను పీడిస్తున్నాయి. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. కొన్ని పాఠశాలలు పూర్తిగా మూతపడ్డాయి. ఇలా అనేక సమస్యలు ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్నాయి. వాటి పరిష్కార మార్గం చూపడంలో ప్రభుత్వం విఫలమైంది.

పూర్తిగా అందని పాఠ్యపుస్తకాలు
సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్, కేజీవీబీలు, రెసిడెన్షియల్ ఇలా అన్ని కలుపుకొని 1,053 ఉన్నాయి. వీటిలో 95,741 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.మెదక్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 901, కేజీవీబీలు 19, గురుకులాలు 27, ఆదర్శ 7, ప్రభుత్వ ఉపాధ్యాయులు 3,391 మంది ఉన్నారు. 110 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి 1,20,357 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 1,248 ప్రభుత్వ పాఠశాలల్లో 1.09 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇంత వరకు అన్ని పాఠశాలల్లో పూర్తిగా పాఠ్యపుస్తకాలు అందలేదు.
ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలతో పాట నోట్బుక్కులు ఇవ్వాలి. కానీ ఇంత వరకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ప్రతి ఏటా ఏక రూప దుస్తులు పంపిణీ చేస్తున్నారు. ఇవన్నీ పాఠశాలలు ప్రారంభమయ్యే రోజు ఇవ్వాలి. ఈ సారి సీఎం కిట్ ద్వారా బూట్లు, టై, బెల్ట్లతో పాటు తొమ్మిది రకాల వస్తువులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కానీ ఇంత వరకు వస్తువులు అందకపోవడంపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నారు. తాజాగా ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం దుస్తుల కలర్ మార్చింది.
కానీ ఇంత వరకు కొత్తవి రాలేదు. పాత దుస్తులతోనే విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. ఏక రూప దుస్తుల్లో భాగంగా 1 నుంచి 3వ తరగతి వరకు బాలికలకు, 4వ, 5వ తరగతి విద్యార్థినులకు ఏకరూప దుస్తులు ఇస్తారు. 6వ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థినులకు పంజాబీ డ్రెస్, బాలురకు నెక్కరు లేదా ప్యాంట్ షర్టుకు రెండు జేబులు, మధ్యలో క్లాత్తో పట్టి, భుజాలపై క్లాపులు,రెండు చేతులకు క్లిప్పులతో కూడిన డ్రెస్లను గత సంవత్సరం వరకు అందించారు. ఈ సంవత్సరం కొత్త దుస్తులు ఇస్తామంటున్నారు. అవి వచ్చేది ఎప్పుడు.. విద్యార్థులు వేసుకునేది ఎప్పడు అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాతవి, చినిగిన దుస్తులతోనే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.పుస్తకాలు, నోట్ పుస్తకాలను పాఠశాలల ప్రారంభం రోజు ప్రభుత్వం అందించలేదు.
