మెదక్ మున్సిపాలిటీ/ సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 2 : నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మెదక్ జిల్లాలో 10,700 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, 69 సెంటర్లు, సంగారెడ్డి జిల్లాలో ఎగ్జామ్స్ రాస్తున్న 21,413 మంది కోసం 118 సెంటర్లు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు కల్పించి, 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా అన్ని మౌలిక వసతులు కల్పించారు. ఎండాకాలం దృష్ట్యా వైద్యసిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎక్కడా అవకతవకలు చోటుచేసుకోకుండా అవసరమైన ఫ్లయింగ్ స్కాడ్లు, ఇన్విజిలేటర్లు, రూట్, డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూరింటెండెంట్లను నియమించారు. హాల్ టికెట్లు అందని, పోగొట్టుకున్న విద్యార్థులు www.bse.telanagana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లు, శరత్కుమార్, రాజర్షి షా అధికారులను ఆదేశించారు.
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 2: పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 84 పరీక్షా కేంద్రాల్లో 15,652 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 488 పాఠశాలలున్నాయి. 15,652 మందిలో 14,186 మంది రెగ్యులర్ విద్యార్థులున్నారు. ఏడుగురు ప్రైవేట్ విద్యార్థులు, 1,459 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షా కేంద్రాల్లో 840 మంది ఇన్విజిలేటర్లు, 84 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 84 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఐదుగురు సిట్టింగ్ స్కాడ్స్, 5 ఫ్లయింగ్ స్కాడ్స్ టీమ్లు, ఏడుగురు రూట్ ఆఫీసర్లు, ఏడుగురు అడిషనల్ రూట్ ఆఫీసర్లు, 46 మంది జాయింట్ కస్టోడియన్లు ఉన్నారు. 23 స్టోరేజీ పాయింట్లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు డీఈవో శ్రీనివాస్రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9440665585, జిల్లా విద్యాధికారి నంబర్ 7995087610లో సంప్రదించవచ్చు. పరీక్షల సమయంలో ఏ ఆర్టీసీ బస్సులోనైనా పదో తరగతి విద్యార్థులు వారి హాల్ టికెట్ను ఆర్టీసీ సిబ్బందికి చూపించి ఉచితంగా ప్రయాణించొచ్చు.
మెదక్ జిల్లాలో..
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 2: పదో తరగతి పరీక్షలు నేటి నుంచి 13వ తేదదీ వరకు జరుగనున్నాయని, అందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని మెదక్ డీఈవో రాధాఐకిషన్ తెలిపారు. జిల్లాలో 10.700 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఇందుకు 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. విద్యార్థులు www.bsetelangana.gov.in వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రామీణ విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 2: సంగారెడ్డి జిల్లాలో 118 పరీక్షా కేంద్రాల్లో 21,413 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 18 మంది రూట్ అధికారులు, 118 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 118 మంది డిపార్ట్మెంటల్ అధికారులు (డీవో), ఒక అదనపు డీఏవో, 1100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. విద్యార్థులు హాల్ టికెట్లు, పెన్, పెన్సిల్, రైటింగ్ ప్యాడ్ను వెంట తీసుకురావాలి.
పరీక్ష ఇలా రాద్దాం..
కొమురవెల్లి, ఏప్రిల్ 2: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మందికి ఎలా ప్రిపేర్ కావాలో తెలియక టెన్షన్ పడుతుంటారు. అలాంటి వారు ఎలాంటి నియమాలు పాటించాలో ప్రత్యేక కథనం..
* తెల్లవారుజామున 4:30 నిమిషాలకు నిద్ర లేవండి
* ఉదయం 4:30 నుంచి 6:30 వరకు చదువుకోవాలి.
* ఒక అరగంట విశ్రాంతి తీసుకోవాలి.
* అరగంట కాల కృత్యాలకు, స్నానానికి కేటాయించాలి.
* తర్వత పుస్తకం తెరచి ముఖ్యమైన పాయింట్స్ మరోసారి చూసుకోవాలి.
* ఆహారం మితంగా తీసుకోవాలి.
* పరీక్ష కేంద్రానికి దూరం ఉన్నవారు కొంచెం ముందే బయలుదేరాలి.
* 8:50 గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
* ప్రశాంతంగా పరీక్ష హాల్లోకి వెళ్లాలి.
* ఇన్విజిలేటర్లు చెప్పే సూచనలు గమనించాలి.
* జవాబు ప్రతం ఇవ్వగానే దానికి మార్టిన్లు కొట్టాలి.
* ప్రశ్నా పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి.
* బాగా వచ్చిన జవాబులు ముందుగా రాయాలి.
* తప్పులు, కొట్టివేతలు లేకుండా రాయాలి.
* రాసేటప్పుడు ప్రశ్న నెంబర్, సెక్షన్ రాయాలి.
* జవాబు పూర్తికాగానే గీత కొట్టాలి.
* ముందు తెలిసిన జవాబులు తప్పుల్లేకుండా రాయాలి.
* చివరకు తెలియని ప్రశ్నలు, చాయిస్ కింద ట్రై చేయాలి.
* గుర్తు రాకపోతే తలను ఎడమ వైపు తిప్పి ఆలోచించాలి.
* చివరి 15 నిమిషాలు రాసిన పేపర్ను ఒకసారి పరిశీలించాలి.
* తప్పులు, ప్రశ్న నెంబర్లు సరి చూడాలి.
* బిట్ పేపర్ ఇవ్వగానే దారంతో కట్టాలి.
* ముందు తెలిసినవి రాసి చివరగా ఆలోచించి ఏదీ వదలకుండా పూర్తి చేయాలి.
* బొమ్మలు, మ్యాప్, గ్రాఫ్ పైపర్ మీద పెన్ ఉపయోగించొద్దు.
* వార్నింగ్ బెల్ కొట్టినా లేవద్దు. అన్నీ పరిశీలించాకే బయటకు రావాలి.
* జరిగిన పరీక్షలో పొరబాటున ఏదైనా తప్పు రాస్తే దాని గురించే ఆలోచించొద్దు.
* ఇంటికి వెళ్లి లంచ్ చేసి ఒక గంట నిద్రపోవాలి.
* చదుతున్న సమయంలో మధ్య మధ్యలో 15 నిమిషాలు విరామం ఇవ్వాలి.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
సిద్దిపేట జిల్లాలోని 84 పరీక్షా కేంద్రాల వద్ద నేటి నుంచి 13వ తేదీ వరకు రోజూ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షలు అమలులో ఉంటుంది. పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలి. పరీక్ష సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తారు. పోలీస్స్టేషన్ నుంచి పరీక్షా పత్రం పరీక్షా కేంద్రానికి వెళ్లే సమయంలో కానిస్టేబుల్ తప్పనిసరిగా ఎస్కార్ట్ ఉండాలి. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. – శ్వేత, సీపీ, సిద్దిపేట
పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతి పరీక్షా కేంద్రంలోని సిబ్బంది తప్పకుండా ఐడీ కార్డు ధరించి రావాలి. పరీక్షా కేంద్రాల్లోకి ఏ ఒక్క సిబ్బందికి సెల్ఫోన్ అనుమతి లేదు. ఒక్క నిమిషం నిబంధన ఏమి లేదు. ఉదయం 9.35 వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగానే చేరుకుని ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉత్సాహంగా పరీక్షలు రాయాలి.
– శ్రీనివాస్రెడ్డి, డీఈవో, సిద్దిపేట
ఒత్తిడి లేకుండా పరీక్ష రాయాలి
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయా లి. పరీక్షల సమయంలో భయాందోళనకు గురికాకుండా తల్లిదండ్రులు వారి ని మానసికంగా సిద్ధం చే యాలి. విద్యార్థులకు ప్రత్యే క తరగతులు నిర్వహించి, పోషకాహారాన్ని అందిం చాం. ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించి అందులో వెనుకంజలో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాం. ఇదే స్ఫూర్తితో పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని విశ్వాసం ఉన్నది. – డాక్టర్ శరత్, కలెక్టర్, సంగారెడ్డి