పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
రామాయంపేట, జూన్ 4: రాష్ట్రంలో ఎక్కడైనా గొర్ల కాపర్లపై వివక్ష చూపి, దాడులకు దిగితే వారిపై కఠిన చర్యలు తప్పవని, కేసులు కూడా నమోదు చేస్తామని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. శనివారం హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తుండగా మార్గమధ్యలో రామాయంపేట మల్లన్న దేవాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గొర్లకాపర్లపై దాడులు జరుగుతున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా దాడులు జరిగిన మాట వాస్తవమేనని, కొన్ని ప్రాంతాల్లో గ్రామాభివృద్ధి కమిటీలున్నాయని, వారికి అనుగుణంగా నడవకుంటే దాడులు చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు.
విషయం ఏదైనా ఉంటే కూర్చుని పరిష్కరించుకోవాలే తప్ప దాడులు పరిష్కారం కావన్నారు. ఒక్క గొర్ల కాపర్లనే కాకుండా అన్యాయంగా ఎవరిపై దాడి చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, కచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రామాయంపేట గొర్ల కాపర్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర గొర్ల పెంపకం, గొర్లకాపర్ల సంఘం చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాల్రాజు యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు రాజు యాదవ్, రామాయంపేట సొసైటీ అధ్యక్షుడు ఊడెం దేవరాజు, బసన్నపల్లి మల్లేశం, జాల స్వామి, గోపాల్ యాదవ్, గాయంతి కుమార్, పల్లె సత్తయ్య, కిషన్, రమేశ్, శ్రీశైలం యాదవ్ ఉన్నారు.