జనగామ, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకో వైద్య కళాశాలను మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని చంపక్హిల్స్ ఎంసీహెచ్ వద్ద ప్రభుత్వ మెడికల్ కళాశాలను హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ వర్చువల్గా ప్రారంభించారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు, ల్యాబ్లు, టీచిం గ్ గదులను పరిశీలించి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన విద్యార్థినీ, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు.
అనంతరం స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో మెడికల్ కాలేజీ తరగతులను ప్రారంభించుకోవడం.. వచ్చే ఏడాది మరో ఎనిమిది కాలేజీలను సిద్ధం చేస్తుండడం దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయం అన్నారు. గతంలో వైద్య విద్య ఎంతో ఖర్చుతో కూడుకుని ఉన్నందున పేద, మధ్యతరగతి వర్గాలకు డాక్టర్లు కావాలనే కోరిక అందని ద్రాక్షగా ఉండేదన్నారు.
కానీ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా రాష్ట్రంలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరిగాయన్నారు. దీంతో సామాన్య విద్యార్థుల్లో సైతం డాక్టర్లం కావాలనే పట్టుదల, తపన పెరిగిందన్నారు. అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని మంత్రి స్పష్టం చేశారు. మనకోసం ఇంతగా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. జనగామ ప్రాంతం గతంలో ఎట్లా ఉండేది.. తెలంగాణ సాధించుకున్న తర్వాత జిల్లా తెచ్చుకున్న తర్వాత జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల అభివృద్ధి ప్రజల కండ్లముందు కనబడుతున్నదన్నారు.
ఉచితాలు కాదు..ప్రజల బతుకుదెరువు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
‘ఉచితాలు అంటూ తెలంగాణ సంక్షేమ పథకాలను ఎద్దేవా చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతల్లారా..మా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నవి ఉచితాలు కాదు..ప్రజల బతుకుదెరువు అన్న సంగతి గుర్తుంచుకోవాలి’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే ఏం వస్తుందన్న వారు ఒక్కసారి గతంలో జనగామ ఎట్లుండే..ఇప్పుడు ఎట్లున్నది చూసి మాట్లాడితే జవాబు దొరుకుతుందన్నారు. తెలంగాణ వస్తే జనగామ జిల్లా వచ్చింది..రాష్ట్రంలోనే బ్రహ్మండమైన కలెక్టరేట్ నిర్మించుకున్నం, మెడికల్ కాలేజీ వచ్చిన ఏడాదిలోనే ప్రారంభించుకున్నం..100 సీట్లకు 85 సీట్లు మన వాళ్లకే డాక్టర్ అయ్యే ఛాన్స్ దక్కిందని ఆయన పేర్కొన్నారు.
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీల్లో జనగామ దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో జిల్లా అన్నిరంగాల్లో అగ్రపథంలో నిలుస్తున్నదన్నారు. కలెక్టరేట్ పార్కింగ్ మాదిరిగా ఎంసీహెచ్ క్రిటికల్ కేర్ దవాఖాన పార్కింగ్కు అదనంగా రూ.4కోట్లు మంజూరు చేయించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మంత్రి దయాకర్రావును కోరారు. 30 ఎకరాల స్థలం ఉన్న దవాఖాన ఆవరణలో రాబోయే రోజుల్లో నర్సింగ్ కాలేజీ నిర్మించుకుందామన్నారు. సీఎం కేసీఆర్ ఊహించనిరీతిలో జనగామకు మెడికల్ కాలేజీ ఇచ్చి ఏడాదిలోనే ప్రారంభింపజేయడంపై ధన్యవాదాలు తెలిపారు.
దేశంలో 57శాతం సీట్లు ఉంటే తెలంగాణలో 42 శాతం డాక్టర్లను ఇసున్న ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని అన్నారు. ఏరంగంలోనైనా దేశం అబ్బురపడేలా తెలంగాణను తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తాగు, సాగు నీటి రంగాలతో అద్భుతమైన ప్రగతి సాధించారన్నారు. గోదావరిపై ఉన్న ప్రాజెక్టుకు రీడిజైన్ చేసి ఇంజినీరింగ్ వ్యవస్థకే ఇంజినీర్ ఇన్ చీఫ్ అయి పారే నదిని పైకి మళ్లించి చరిత్ర సృష్టించారన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలుస్తుందని, తెలంగాణ ఎక్కడ ఉంటదని ఢిల్లీలో అడిగే స్థితి నుంచి ప్రపంచ పటంలో హైదరాబాద్ను గ్రీన్సిటీగా నిలిపిన ఘనత కేటీఆర్, కేసీఆర్ది అన్నారు.
సాధించిన ఘనత మీ అందరి కండ్లముందే ఉందని, క్షేత్రస్థాయిలో ఏదీ ఇస్తే బాగుపడుతుదని తెలిసిన ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, మార్కెట్ చైర్మన బాల్దె సిద్ధిలింగం పాల్గొన్నారు.