సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, జూన్ 15 : సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్న సమయంలో చేసిన కార్యక్రమాలే నేడు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు స్ఫూర్తినిచ్చాయని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలో గురువారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సిద్దిపేట ఐటీ టవర్ను ప్రారంభించారు. ప్రముఖ 14 కంపెనీలకు అలాట్మెంట్ ఆర్డర్తోపాటు, వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన 714మందికి ఉద్యోగ నియామకపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఐటీ టవర్ పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఇం టింటా తాగునీరు.. మిషన్ భగీరథకు, దళిత చైత న్య జ్యోతి.. దళితబంధుకు, సిద్దిపేట హరితహా రం.. తెలంగాణకు హరితహారం స్ఫూర్తినిచ్చింది సిద్దిపేటేనన్నారు. ‘స్వచ్ఛబడి సిద్దిపేట’ స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్వచ్ఛబడిని ఈ ఏడాదిలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. సిద్దిపేటలో ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్రమంతా విస్తరింపజేస్తామని చెప్పారు.
1980వ దశకంలో సిద్దిపేటలో అభివృద్ధి ఒరవడిని కేసీఆర్ చేపట్టారన్నారు. ఆనాడు కేసీఆర్ సిద్దిపేటలో చేపట్టిన కార్యక్రమాలను ఇవ్వాళ రాష్ట్రమంతా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమా లు కేసీఆర్ కొత్తగా ఆలోచించారని చాలా మంది అనుకుంటారని.. కానీ, ఇక్కడ ఉన్న నాయకులకు వాస్తవం తెలుసున్నారు. ఈ రోజు తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా పర్యావరణాన్ని 7.7 శాతం పెంచి దేశంలో అగ్రశేణి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణకు హరితహారం రాష్ట్రం ఏర్పడ్డాక ప్రారంభమైందనే చాలా మందికి తెలుసునని, కానీ సిద్దిపేటలో హరితహారం 1987-88 లోనే కేసీఆర్ ప్రారంభించారన్నారు.
నాడు ఏక కాలంలో 10వేల మొక్కలు నాటారని గుర్తు చేశారు. దళితబంధు కొత్త కార్యక్రమంగా చూస్తున్నారని, నాడు సిద్దిపేట శాసనసభ్యుడిగా ఉన్న రోజే కేసీఆర్ దళిత చైతన్య జ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఇక్కడి దళితులు స్థితిగతులను అధ్యయనం చేసి, ఒక శాసనసభ్యుడిగా తనకు ఆనాడు ఆర్థికపరమైన అధికారాలు లేకపోయినా మనస్సులో ఆనాడే ప్లాన్ రూపొందించుకొని ఈరోజు రాష్ట్రమంతటా దళిత బంధు ప్రారంభించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. 1996-97 ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇంటింటికీ తాగునీరు అందించలేదని, శాసన సభ్యుడిగా కేసీఆర్ పట్టుదలతో కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ నుంచి నీళ్లు తీసుకువచ్చి సిద్దిపేట ప్రజలకు ఇంటింటికీ తాగునీరు అందించారన్నారు. ఇక్కడి ప్రజలు ఆనాడే మంచినీళ్ల పండుగ చేసుకున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
అసూయ పడేలా సిద్దిపేట అభివృద్ధి చేసి చూపెడుతున్న అద్భుతమైన నాయకుడు మంత్రి హరీశ్రావు అని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లకు వెళ్లేటప్పుడు సిద్దిపేటకు రాగానే ఫోన్ తీసుకొని మంత్రి హరీశ్రావుకు ఫోన్ చేస్తానని చెప్పారు.‘హరీశ్రావును అప్పడప్పడు ఏడ్పిస్తూ..ఎందుకంటే బావ కాబట్టి! రాంగ.. పోంగ సిద్దిపేటలో అది చేస్తున్నవ్.. ఇది చేస్తున్నవ్.. ఇంతింత పెద్ద రోడ్లు వేస్తున్నవ్ అని ఏడ్పిస్తా ఉంటా’.. అంటూ చలోక్తులు విసిరారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం సిద్దిపేటలా మారిన నాడే బంగారు తెలంగాణ, బంగారు భారతదేశం అవుతుందన్నారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచి అయితే, రాష్ర్టానికి మాత్రం సిద్దిపేటే దిక్సూచి అని అన్నారు. ఆనాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ అభివృద్ధిని ప్రారంభిస్తే దాన్ని నాలుగింతలు పైకి తీసుకుపోయిన నాయకుడు, బ్రహ్మాండ అభివృద్ధి కామికుడు హరీశ్రావు అని కేటీఆర్ అన్నారు.
ఎన్నికలు ఎప్పడు వచ్చినా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో హరీశ్రావును గెలిపిస్తారని తనకు, ప్రజలకు తెలుసునని మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ, అయితే ఆ గెలుపు రికార్డులు బద్ధలు కావాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో లక్షా 18 వేల ఓట్ల మెజార్టీ వచ్చిందని, ఈసారి లక్షా 50 వేల ఓట్ల మెజార్టీ తెచ్చే బాధ్యత మీరు తీసుకోవాలంటూ ప్రజలను కోరారు. 714 నుంచి రెం డు షిప్టులకు 1416 ఉద్యోగాలు వచ్చాయని, ఐటీ హబ్ను విస్తరించడం ద్వారా మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. నైపుణ్యం ఇచ్చే కేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.