Notebooks for free | ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రతి నిరుపేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించగా.. ఇపుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇప్పటికే యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇపుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటితో పాటు ఉచితంగా వర్క్ బుక్స్, నోట్బుక్స్ కూడా అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోట్బుక్స్, వర్క్ బుక్స్ అందించడం గొప్ప విషయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేటజిల్లా వ్యాప్తంగా 91,054 మంది విద్యార్థులు ఉచిత నోట్బుక్స్ ద్వారా లబ్ధిపొందనున్నారు. జిల్లాలో 91,054మంది విద్యార్థులకు లబ్ధి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 1013 ప్రభుత్వ పాఠశాలలల్లో 91,054 మంది విద్యార్థులు ఉండగా.. వారందరికీ ప్రభుత్వం ఉచితంగా నోట్బుక్స్ అందజేయనుంది. జిల్లాలో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులు.. 7,340 మంది ఉండగా.. రెండో తరగతిలో 10,302 మంది, మూడో తరగతిలో 8,620 మంది , నాలుగో తరగతిలో 9,643 మంది. ఐదో తరగతిలో.. 9,079 మంది, ఆరో తరగతిలో..8,398 మంది, ఏడో తరగతిలో 10,070 మంది, ఎనిమిదో తరగతిలో..9,152 మంది, తొమ్మిదో తరగతిలో 9,254 మంది, పదో తరగతిలో.9,196 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం సబ్జెక్ట్కు ఒకటి చొప్పున నోట్ పుస్తకాలు అందజేయనుంది.
జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేయాలని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలన్నారు. సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఆదర్శ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు ఇలా అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ఉచిత నోట్ పుస్తకాలు ప్రభుత్వం పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వానికి ధన్యవాదాలు..
ప్రభుత్వానికి ధన్యవాదాలు. మా కూతురు అక్కెనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతుంది. ఇపుడు యూనిఫామ్స్, నోట్పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నారు. ప్రభుత్వం నోట్బుక్స్ కూడా ఉచితంగా అందిస్తామనడం చాలా సంతోషంగా ఉంది. నోట్ పుస్తకాలు ఇవ్వడం వల్ల కొంత ఆర్థిక భారం తగ్గుతుంది. ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడంతో పాటు ఇపుడు నోట్బుక్స్ కూడా ఉచితంగా అందిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– తోట సతీశ్, పేరెంట్, అక్కెనపల్లి, నంగునూరు మండలం