CM KCR | మెదక్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వచ్చి పదేండ్లు అయ్యింది. దశాబ్ది ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఒక వైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుంది. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గడపగడపకూ చేరుతున్నాయి. ప్రభుత్వానికి జేజేలు పలుకుతూ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దివ్యాంగులకు వెయ్యి పింఛన్ పెంపు..
గత ప్రభుత్వాల హయాంలో దివ్యాంగులకు రూ.500 పెన్షన్ మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. దివ్యాంగులకు మొదట రూ.500 నుంచి రూ.1500 వరకు పెంచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రూ.1500 నుంచి రూ.3,116 ప్రభుత్వం పెంచి ప్రతినెలా పింఛన్లను అందిస్తోంది. మెదక్ జిల్లాలో 8,615 మంది దివ్యాంగులకు రూ.3,116 చొప్పున ప్రతి నెలా రూ.2 కోట్ల 78 లక్షలు పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ దివ్యాంగులకు రూ.3,116 నుంచి రూ.4,116కు పెంచారు. దీంతో దివ్యాంగుల పెన్షన్లు జిల్లాలో పదివేలకు పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రతినెలా రూ.4 కోట్ల వరకు పంపిణీ చేయాల్సి ఉంటుందని డీఆర్డీవో అధికారులు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్ రూ.వెయ్యి పెంచి వారికి ఆర్థికంగా ఆదుకుంటున్నారని పలువురు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగులకు సీఎం కేసీఆర్ సరైన న్యాయం చేస్తున్నారని, మేము ఎల్లప్పుడు కేసీఆర్ వెంటే ఉంటామని దివ్యాంగులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
బీసీ కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం..
బీసీ కులవృత్తుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కులవృత్తుల వారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించాలని ఇటీవల రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. రజక, నాయీ బ్రహ్మణ, విశ్వబ్రాహ్మణ, శాలివాహన కుమ్మరి, మేదరి తదితర కులవృత్తుల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి ప్రభుత్వపరంగా రూ.లక్ష సాయం అందించాలని నిర్ణయించింది. కుటుంబంలో ఒకరికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. గ్రామాల్లో రూ.150 లక్షలలోపు, పట్టణాల్లో రూ.2 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఈ పథకాన్ని వర్తింజేస్తున్నారు. 18 నుంచి 58 ఏండ్ల మధ్య వయస్సున వారు మాత్రమే అర్హులు. గత ఐదేండ్లలోపు ఏ ప్రభుత్వ శాఖ ద్వారా అయినా ఆర్థికలబ్ధి పొందినా, 2017-18లో రూ.50వేల లబ్ధిపొందినా ఈ ఆర్థిక సాయానికి అనర్హులు. ఇదిలావుండగా బీసీ కులవృత్తుల వారినుంచి ఈ నెల 20వ తేదీ వరకు బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుంది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో 34మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యేల చేతుల మీదుగా రూ.లక్ష చెక్కులను అందజేశారు.
గొర్రెల పంపిణీలో రెండో విడుత లక్ష్యం 6774..
ప్రభుత్వం గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధి కోసం 2017లో గొ్రర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే మొదటి విడుతలో కొందరికి గొర్రెల యూనిట్లను అందజేసింది. రెండో విడుత కింద మండలాలు, గ్రామాల వారీగా పంపిణీ చేసేందుకు పశు సంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. లబ్ధిదారుల నుంచి కుల, ఆధార్, బ్యాంక్ నామినీ పత్రాలను తీసుకుంటున్నారు. ఒక వేళ లబ్ధిదారుడు చనిపోతే నామినీగా ఉన్న భార్య లేదా కుమారులకు అందజేస్తారు. గతంలో మండలస్థాయి అధికారుల పర్యవేక్షణలో గొర్రెల కొనుగోళ్లు జరిగాయి. ఈసారి జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణలో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పారదర్శకత కోసం జీపీఎస్ విధానం ఉన్న వాహనాల్లోనే జీవాలను తీసుకువస్తున్నారు.
ఇదిలావుండగా మొదటి విడుత సమయంలో గొర్రెలయూనిట్ విలువ రూ.1.25 లక్షలు ఉంది. లబ్ధిదారుడి వాటా రూ.31,250 కాగా, మిగతా సొమ్మును ప్రభుత్వమే ఇచ్చింది. రెండో విడుతలో యూనిట్ ధర రూ.1.75 లక్షలు కాగా, 25శాతం రూ.43,750 లబ్ధిదారుడు తన వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే రూ.12,500 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. లబ్ధిదారులు తమ వాటా మొత్తాన్ని ఆన్లైన్లో నేరుగా జమ చేస్తున్నారు. అయితే మొదటి విడుతలో 75శాతం సబ్సిడీపై రూ.126 కోట్ల 98 లక్షలతో 12,997 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు. రెండో విడుతలో 75 శాతం సబ్సిడీపై రూ.88 కోట్ల 90 లక్షలతో 6,774 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందజేయనున్నారు. ఇదిలావుండగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శువ్రవారం మెదక్ జిల్లాలో 68 మంది గొల్ల కురుమలకు మంజూరు ఉత్తర్వులను ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి అందజేశారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
కేసీఆర్కు దివ్యాంగులందరూ ఎప్పటికీ రుణపడి ఉంటారు. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధితోపాటు దివ్యాంగులు గౌరవంగా జీవించాలనే పింఛన్ను పెంచారు. నెలనెలా ఇచ్చే పింఛన్ను రూ.3,116 నుంచి రూ.4,116కు పెంచడం గర్వించదగ్గ విషయం. ముఖ్యమంత్రి కేసీఆర్కు జిల్లా దివ్యాంగుల తరఫున ప్రత్యేక కృతజ్ఞ్ఞతలు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
– మీర్ గియాసుద్దీన్, తెలంగాణ దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, చేగుంట
ప్రభుత్వ సాయం మరువలేనిది
గొర్రెలకాపరులకు ప్రభుత్వం సబ్సిడీతో గొర్రెలు పంపిణి చేయడంతో ఎంతోమంది గొర్రెలు, మేకల కాపలాదారులు ఉపాధి పొందారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా యాదవసంఘాలకు చేయూతనివ్వలేదు. సీఎం కేసీఆర్ కులవృత్తులను ఆదుకోవడం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడంతో ఎంతోమంది పేదలు లబ్ధిపొందుతున్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ వారికి అండగా నిలుస్తున్న కేసీఆర్ సార్కు రుణపడివుంటాం. త్వరలో రెండో విడుత గొర్రెల పంపిణీకి చర్యలు తీసుకుంటుండటంతో మరింత మందికి లబ్ధి చేకూరనుంది.
– కాడగోని కిష్టయ్య, లింగాపూర్
అన్ని కులాలకు సమప్రాధాన్యం
అన్ని కులాల వారికి సమ ప్రాధాన్యాత ఇస్తూ చేయుతగా సీఎం కేసీఆర్ రూ.లక్ష కేటయించడం సంతోషించ దగ్గ విషయం. బడుగు బలహినవర్గాల కుటుంబాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన బాగుంది. నాకు వచ్చే లక్ష రూపాయలతో నా టైలర్ షాప్ను డెవలప్ చేసుకుంటా.
– చాకలి అంబయ్య టైలర్, ఉసిరికపల్లి, వట్పల్లి
గొర్రె పిల్లలతోనే బతుకుతున్నం
సీఎం కేసీఆర్ సార్ మాకు ఉచితంగా గొర్రెలను ఇచ్చిండు. ఇప్పుడు గా గొర్రె పిల్లలతోనే బతుకుతున్నం. మాకు గొర్రెలను ఇచ్చిన దేవుడిని మరచిపోం. రెండో విడత కూడా గొర్రె పిల్లలను ఇస్తనని చెప్తుండు. ఇగ మాకు ఏం ఇబ్బంది ఉండదు. కేసీఆర్ సార్కు మేము మా కుటుంబం జీవితకాలం రుణపడి ఉంటాం.
– గాయంతి ఎల్లయ్య, గొర్రెల కాపరి, రామాయంపేట
సీఎం సారుకు రుణపడి ఉంటాం..
తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా దివ్యాంగులకు నెలకు పింఛన్ రూ.3,116 ల నుంచి రూ.4,116 వరకు పెంచి మా బతుకులకు భరోసా కల్పించింది. సీఎం కేసీఆర్ సార్ అన్ని తీర్ల మమ్మల్ని ఆదుకుంటున్నడు. దివ్యాంగులకు ప్రత్యేక రాయితీలు రుణాసదుపాయాలు కల్పింస్తూ మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. సీఎం సార్కు రుణపడి ఉంటాం.
– సంతోష్కుమార్, దివ్యాంగుడు, మెదక్
విశ్వబ్రాహ్మణులకు పెద్ద శుభవార్త..
సీఎం కేసీఆర్ కులవృత్తుల్లో భాగంగా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయడం శుభవార్త. నర్సాపూర్ మండల వ్యాప్తంగా సుమారు 1200 మంది విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మలున్నారు. ఈ డబ్బులతో వారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మలు జీవితాంతం రుణపడి ఉంటాము. అందరి తరుఫున సీఎం సార్కు కృతజ్ఞతలు.
– కృపాచారి, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి, నర్సాపూర్
దివ్యాంగుల పాలిట దేవుడు కేసీఆర్..
సీఎం కేసీఆర్ సార్ దివ్యాంగులకు రూ.వెయ్యి పెంచి మా పాలిట దేవుడిలా మారారు. ఇప్పుడు నాకు రూ.3,116 పింఛన్ ఇచ్చి ఆదుకుండు. వచ్చే నెల నుంచి మరో వెయ్యి కలిపి రూ.4,116 రానుండడంతో మా సంతోషం రెట్టింపయ్యింది. ఈ పింఛన్ లేకపోతే నా బతుకు ఆగమయ్యేది. సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
– చాకలి మహేశ్, వికలాంగుడు, నర్సాపూర్