సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 24:సంగారెడ్డి జిల్లాలోప్రైవేటు పాఠశాలలకు దీటుగా పదవ తరగతి విద్యార్థులు ఫలితాలు సాధించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. అధికారులు, ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లతో కలెక్టర్ శరత్ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేస్తున్నారు. గత ఏడాది పదవ తరగతి పరీక్షల్లో సంగారెడ్డి రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలవగా, ఈ సారి మొదటి స్థానం దక్కించుకునేలా కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 452 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 21,363 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారు. పరీక్షల్లో వందశాతం ఫలితాల సాధన కోసం విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. గత ఏడాది డిసెంబర్ వరకు వందశాతం సిలబస్ పూర్తి చేయగా, ప్రస్తుతం సిలబస్ రివిజన్ను ప్రారంభించింది.
ప్రత్యేక తరగతులు..విద్యార్థుల దత్తత
పదవ తరగతి విద్యార్థులకు నవంబర్లో ఎస్ఏ 1(సమ్మెటివ్ అసైస్మెంట్-సంగ్రహణాత్మక మూల్యాంకనం) పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో మార్కుల కు అనుగుణంగా విద్యార్థులను నాలుగు కేటగిరీల్లో విభజించారు. 70 శాతం మార్కులు సాధించిన విద్యార్థులను టాప్ 1, 60 శాతం పొందిన వారిని టాప్, 59 శాతం వస్తే యావరేజ్, 35 శాతం వచ్చిన వారిని బిలో యావరేజ్ కేటగిరీలో ఉంచారు. వీటిని అనుసరించి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇందుకోసం అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 8.30నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఆరు సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో సబ్జెక్టులో 5 నుంచి 20 మంది విద్యార్థులను దత్తత తీసుకుని సందేహాలు నివృత్తి చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 10,700 మంది ఏప్రిల్ 3 నుంచి జరిగే వార్షిక పరీక్షలకు మెదక్ జిల్లా నుంచి 10,700 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లాలో 898 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల నుంచి 5,347 మంది బాలురు, 5,353 మంది బాలికలు ఉన్నారు. ఇందుకుగాను జిల్లాలో 70 పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు విద్యాశాఖకు నివేదిక పంపించారు.
వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా..
పది జీపీఏతో వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సబ్జెక్టుల వారీగా వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవతో విద్యా బోధన చేస్తున్నారు. విద్యార్థులకు సులభ పద్ధతులతో బోధిస్తున్నారు. మోడల్, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులే తగు సూచనలు అందజేస్తున్నారు. గణితం, సైన్స్ తదితర క్లిష్టతరమైన సబ్జెకుల్లో అర్థమయ్యేలా సహకరిస్తున్నారు.
పాఠ్యాంశాలపై వారాంతంలో టెస్టులు
ప్రతి విషయంలో ఆయా పాఠ్యాంశాలపై వారంతంలో విద్యార్థులకు స్లిప్ టెస్టులు పెడుతున్నారు. ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రత్యేకంగా ప్రశ్నలు రూపొందించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గణితం, ఇంగ్లిష్, సైన్స్ వంటి సబ్జెక్టుల్లో విద్యార్థుల్లోని భయాన్ని పోగొట్టేందుకు ఉపాధ్యాయులంతా కలిసి కృషి చేస్తున్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు కృషి చేయాల్సిన అసవరం ఉంది. విద్యార్థులను పరీక్షలకు మానసికంగా సిద్ధం చేస్తున్నాం. భయాందోళనలకు గురి కాకుండా పరీక్షలకు సన్నద్దమైతే ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. వంద శాతం ఉతీర్ణత సాధించేలా కృషి చేస్తున్నాం. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి.
– రమేశ్కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి, మెదక్