చేర్యాల, జనవరి 6 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు.మల్లన్న కల్యాణానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్తో కలిసి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరుకానున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
వైభవంగా కల్యాణం
ఆలయ సంప్రదాయం మేరకు వరుడు మల్లికార్జునస్వామి తరపున పడిగన్నగారి వంశస్తులు పి.మల్లికార్జున్ దంపతులు, వధువులు మేడలాదేవి, కేతమ్మదేవి తరఫున మహాదేవుని వంశస్తులు మహాదేవుని మల్లికార్జున్ దంపతులు పాల్గొననున్నారు. ఉదయం 10:45 గంటలకు కొమురవెల్లి ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోట బావి వద్ద నిర్మించిన కల్యాణ వేదికలో మధ్యప్రదేశ్ ఉజ్జయిని పీఠాధిపతి సిద్ధలింగరాజు దేశికేంద్ర శివాచార్య ఆధ్వర్యంలో కల్యాణం జరుగనుంది. ఆదివారం వేకువజామున ఐదు గంటలకు స్వామివారికి దృష్టికుంభం (బలిహరణం), 10.45 గంటలకు స్వామివారి కల్యాణం, మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి ఏడు గంటలకు రథోత్సవం (బండ్లు తిరుగుట), సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన, అనంతరం మహమంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ ఉంటుంది.
వేలాదిగా తరలి రానున్న భక్తులు
స్వామి వారి కల్యాణోత్సవానికి 30వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశమున్నందున ఆలయవర్గాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. 60వేల లడ్డూ ప్రసాదాలతోపాటు ఐదు క్వింటాళ్ల పులిహోర ప్యాకెట్లు తయారు చేశారు. రెగ్యులర్ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది మొత్తం 70 మంది, 100 మంది వలంటీర్లు విధులు నిర్వహించనున్నారు. ప్రభుత్వశాఖల అధికారులు సైతం పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సులే కాకుండా సిద్దిపేట, జనగామ జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేకంగా నడిపించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.