సిద్దిపేటరూరల్, జూన్ 25: మీ వెన్నంటి ఉంటానని.. మనమంతా కలిసికట్టుగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్హాల్లో ఆదివారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్తో కలిసి మంత్రి హరీశ్రావు హాజరై మాట్లాడారు. మీ అందరి ప్రేమ, అభిమానం, ఆదరణకు సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర రాజధానిలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గౌరవించుకున్నామన్నారు. వివిధ శుభకార్యాలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు అనువైన స్థలం ఇవ్వాలని మాల ఎంప్లాయీస్ యూనియన్ బాధ్యులు కోరగా అందుకు 500 గజాల స్థలం ఇచ్చేందుకు మంత్రి అంగీకరించారు. ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ ఆలోచనలు అమలు చేసే మంత్రి హరీశ్రావు ఉండడం సిద్దిపేట వాసులుగా మీరంతా అదృష్టవంతులన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మాల ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గమని గర్వపడేలా మంత్రి హరీశ్రావు ఈ ప్రాంతాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేశారన్నారు. తొమ్మిదేళ్ల క్రితం సిద్దిపేట..ప్రస్తుత సిద్దిపేటను చూస్తే శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. అభివృద్ధితో పాటు సంక్షేమం, ప్రజారోగ్యం, విద్యారంగంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. పచ్చని చెట్లు, సిద్దిపేటలో ఎక్కడ చూసినా పరిశుభ్రత కనిపిస్తున్నదన్నారు. మేమంతా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లమని, బీడుబారిన భూములకు కాళేశ్వరం ప్రాజెక్టుతో జలకళ వచ్చి పొలాలు పచ్చబడ్డాయని తెలిపారు. అనేక విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు ఐటీహబ్ కూడా ఏర్పాటు అయిందని, ఇందుకు మంత్రి అహర్నిశలు కష్టపడి పనిచేయడం మూలం గానే జరిగిందన్నారు. మంత్రి నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తామని ఆత్మీయ తీర్మానం అందిస్తామని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తెలిపారు. మంత్రి హరీశ్రావుకు ఎల్లవేళలా అండగా ఉంటామని మాల ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆత్మీయ తీర్మానం చేశారు. ఇందుకు సభ్యులంతా అంగీకారం తెలిపారు. సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి, మాల ఎంప్లాయీస్ యూనియన్ సంఘం అధ్యక్షుడు కనకయ్య, ప్రధాన కార్యదర్శి స్వామిదాస్, డిప్యూటీ తహసీల్దార్ రాజేశం, అసోసియేషన్ సంఘం సభ్యులు పెద్దఎత్తున హాజరయ్యారు.