ఉమ్మడి జిల్లా నెట్వర్క్, నమస్తే తెలంగాణ, జనవరి 10 :ఉమ్మడి జిల్లాలో ఊరూ.. వాడా పండుగ చేసుకున్నది. రైతుబంధు ద్వారా నాలుగేండ్లలో రూ.50వేల కోట్ల సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రైతులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా నియోజకవర్గ, మండల కేంద్రాలతో పాటు పల్లెపల్లెనా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ర్యాలీల్లో జై తెలంగాణ.. జైజై కేసీఆర్ నినాదాలు మార్మోగాయి. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ రైతులను అధికారులు, టీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ దేశ చరిత్రలో రూ.యాభై వేలకోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. రైతు ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసి, 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర ఇస్తూ వారిలో ఆత్మస్తైర్యం కల్పించారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ ఏనాడూ వ్యవసాయరంగాన్ని పట్టించుకోలేదని, అడ్డగోలు విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.