సిద్దిపేట అర్బన్, మార్చి 21: ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా నిఘా బృందాలు పకడ్బందీగా విధులు నిర్వహించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మను చౌదరి ఆధ్వర్యంలో జిల్లాలోని ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ, ఎక్స్పెండీచర్ అబ్జర్వేషన్ బృం దాలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం, రాష్ట్ర అధికారులు జిల్లా స్థాయిలో నిఘా బృందాల పనితీరుపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ, పబ్లిక్, ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేసిన అన్నిరకాల ప్రచార హోర్డింగులు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, వాల్పేపర్లను పూర్తిస్థాయిలో తొలిగించాలన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే వాటికి సరైన పత్రాలు చూపించకపోతే సీజ్ చేయాలన్నారు. సీ-విజల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులు 100 నిమిషాల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను ఎక్స్పెండీచర్ మానిటరింగ్ టీమ్ ఎన్నికల సంఘం నిర్ణయించిన రేట్ ఛార్జ్ ప్రకారం లెక్కించాలన్నారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 8 చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఎలాంటి అలసత్వం వహించవద్దన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఎన్నికల సభలకు, సమావేశాలకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు మాత్రమే అనుమతి ఉందన్నారు. మతపరమైన ప్రార్థనా మందిరాల వద్ద, స్థలాల వద్ద ఎలాంటి పార్టీ ప్రచారాలు నిర్వహించకూడదని,వీటిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, దుబ్బాక ఏఆర్ఓ గరిమా అగర్వాల్, అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, డీఆర్ఓ నాగరాజమ్మ, సిద్దిపేట, హుస్నాబాద్ ఏఆర్ఓలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.