మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ రూరల్/ రామాయంపేట/ వెల్దుర్తి/ తూప్రాన్/ నర్సాపూర్/ చిన్నశంకరంపేట, జూలై3: జిల్లాలో గురుపౌర్ణమి వేడుకలను భక్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో పూజారులు బాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలుచేపట్టారు. జిల్లా కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ మండల పరిధిలోని కొయ్యగుట్ట మల్లికార్జున స్వామి ఆలయంలో, రామాయంపేట మండల కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో గరుడసేవ, పల్లకీసేవతో పాటు ప్రత్యేక పూజలు చేశారు.
మాసాయిపేట, వెల్దుర్తిలోని భూలక్ష్మిమాత ఆలయం, సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం నిర్వహించారు. తూప్రాన్ పట్టణంలోని అంబేద్కర్నగర్ సాయిబాబా దేవాలయంలో ఆలయ ధర్మకర్త, హైకోర్టు అడ్వకేట్ ఎండ్రెల్లి వెంకటస్వామి ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. నర్సాపూర్, చిన్నశంకరంపేట సాయిబాబా ఆలయంలో భక్తులు పల్లకీ సేవ కార్యక్రమాలు చేపట్టారు.