మెదక్, జూన్ 21 (నమస్తే తెలంగాణ)/మెదక్ మున్సిపాలిటీ : తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండుగలకు సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యత ఇస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రావిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురసరించుకుని ఏడుపాయల ఆలయం, మెదక్ సీఎస్ఐ చర్చి, ఆజంపురా మసీదుల్లో కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్ తదితరులతో కలిసి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, నమాజ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతి తరహా తెలంగాణలోని యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించారన్నారు.
ప్రతిఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన అవసరమన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో క్రిస్మస్, దసరా, రంజాన్ ఇలా అన్ని వర్గాల పండుగలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. తొమ్మిదేండ్ల సుదీర్ఘమైన పాలనలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సుస్థిరరమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. మెదక్ చర్చి గౌరవాన్ని పెంపొందించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పరంగా దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. కార్యక్రమంలో మైనారిటీ జిల్లా అధికారి జెంల్లా నాయక్, బీసీ అభివృద్ధి అధికారి శంకర్, ఆర్డీవో సాయిరామ్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీనివాస్, కిశోర్, సమియొద్దిన్, ఫాలిన్ శాంసన్, బీఆర్ఎస్ నాయకులు గంగాధర్, కృష్ణాగౌడ్, రాగి అశోక్, లింగారెడ్డి, నవీన్, కొండ శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, మత పెద్దలు పాల్గొన్నారు.