మెదక్ : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడేందు కు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రాహ్-వీర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు కోరారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ప్రమాదం జరిగిన తొలి గోల్డెన్ అవర్లో సమీపంలోని గుర్తింపు పొందిన దవాఖానకు తరలించిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల ప్రోత్సాహక నగదు అందజేస్తుందని తెలిపారు. అలాగే ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం కింద రూ.1.5 లక్షల వరకు లేదా గరిష్ఠంగా ఏడు రోజుల పాటు ఉచిత క్యాష్లెస్ వైద్య చికిత్స అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాన్ని గమనించిన వెంటనే ప్రజలు ఆలస్యం చేయకుండా 112, 100 లేదా 108కు సమాచారం అందించి బాధితులను సురక్షితంగా దవాఖానకు తరలించేందుకు సహకరించాలని ఎస్పీ సూచించారు. గాయపడిన వారికి సమయానికి చికిత్స అందించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, అత్యవసర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ప్రమాద బాధితులకు సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.