కంగ్టి, జూన్ 9: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్లో జొన్న రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. కంగ్టి-పిట్లం రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు ధర్నా చేపట్టడంతో పిట్లం-ఔరాద్, బీదర్కు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వం జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ గన్నీబ్యాగుల కొరత, లారీలు సకాలంలో రాక తూకంలో జాప్యం జరుగుతున్నదని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.
జొన్నలను కేంద్రాలకు తరలించినప్పటికీ సకాలంలో తూకం వేయక రాత్రీపగలు అనేతేడా లేకుండా అక్కడే పడుకోవాల్సి వస్తుందన్నారు రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో జొన్నలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయాన్ని అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. దళారులకు సంబంధించిన జొన్నలు త్వరగా తూకం వేస్తున్నారని ఆరోపించారు. సకాలంలో జొన్నలు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారని ఎస్సై దుర్గారెడ్డి తెలిపారు. ఆందోళనకు బీఆర్ఎస్ కంగ్టి మండల నాయకులు సంఘీభావం తెలిపారు.