సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 14: ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్, అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ధరణి, ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం, భూసేకరణ, బౌండరీ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై రెవెన్యూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్, పంచాయతీ అధికారులతో సమీక్షించారు. ఈ నెల 17లోగా గ్రామీణంలో 100 శాతం, అర్బన్లో 90 శాతం పూర్తి చేయాలన్నారు. ధరణి మాడ్యుల్స్లో వచ్చిన అర్జీలన్నింటిని పూర్తి స్థాయిలో పరిష్కరించి, తనకు నివేదిక అందించాలని తహసీల్దార్లను ఆదేశించారు. నిమ్జ్, బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతలకు సంబంధించిన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీపీవో సురేశ్ మోహన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అధికారులు, పంచాయతీ శాఖ అధికారులు పాల్గొన్నారు.