ప్రైవేటు దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానలను ప్రభుత్వం బలోపేతం చేస్తున్నది. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రూ.వేల కోట్లతో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నది. ముఖ్యంగా పేదలపై ఆర్థిక భారం తగ్గించేందుకు డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యపరీక్షలు చేయిస్తున్నది. ఇందుకోసం ఒక్కో సెంటర్లో 10 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక ల్యాబ్ మేనేజర్ను ప్రభుత్వం నియమించింది. గతంలో ఇక్కడ 57 రకాల టెస్ట్లు చేస్తుండగా, ఆదివారం నుంచి ఆ సంఖ్యను 134కు పెంచుతూ వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు హైదరాబాద్ నుంచి వర్చువల్గా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా దవాఖానల్లో సిబ్బంది చికిత్సల కోసం వచ్చే రోగుల నుంచి రక్త, మూత్ర, ఇతర నమూనాలు తీసుకుని ప్రత్యేక వాహనాల్లో జిల్లా కేంద్రంలోని డయగ్నోస్టిట్ సెంటర్కు పంపిస్తారు. కేవలం 24 గంటల్లోనే రిపోర్టు రోగి సెల్ఫోన్కు మెసేజ్ రూపంలో వెళ్తుంది. మెదక్ జిల్లాలో 26 దవాఖానల నుంచి శాంపిల్స్ సేకరిస్తుండగా ఇప్పటివరకు 1,19,283 మంది రోగుల నుంచి 2,17,208 శాంపిళ్లు సేకరించి 4,10,089 పరీక్షలు చేసి రిపోర్టు అందజేశారు.
– మెదక్ (నమస్తే తెలంగాణ), జూలై 3
మెదక్, జూలై 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది. కార్పొరేట్కు దీటుగా సర్కారు దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వైద్య సేవలు అందిస్తున్నది. రోగులందరూ తప్పనిసరిగా రోగానికి సంబంధించిన పరీక్షలు చేసుకోవాలి. ఇందుకోసం ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్లి వేలకువేలు ఖర్చు చేసుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లోనే ఉచితంగా టెస్టులు చేసేందుకు డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించింది. ఇందులో ప్రారంభంలో 57 రకాల పరీక్షలు చేస్తుండగా, నూతనంగా 134 రకాల పరీక్షలు చేస్తున్నారు. అంతేకాకుండా రోగులు తమ పరీక్షలను జిల్లా కేంద్ర దవాఖానకు వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేకుండా, దగ్గరలో ఉన్న పీహెచ్సీకి వెళ్లి శాంపిళ్లు ఇస్తే చాలు, ఆ శాంపిళ్లను వాహనాల ద్వారా జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ హబ్కు తీసుకువస్తారు. ఆ వెంటనే పరీక్షలు చేసి రోగి ఫోన్కు మెసేజ్ వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది.
24 గంటల్లో రిపోర్టులు…
మెదక్లో ప్రజలకు సాధారణ పరీక్షలతోపాటు అత్యాధునిక, ఖరీదైన వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ హబ్లో ఈ సేవలు ఉచితంగా అందిస్తున్నారు. ఇందులో 134 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని వారు సమీపంలోని పీహెచ్సీలో శాంపిళ్లు ఇస్తే, 24 గంటలో టెస్టు రిపోర్టులు అందిస్తున్నారు. పీహెచ్సీ, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా దవాఖానల్లో చూపించుకునే రోగుల నుంచి అక్కడే రక్త, మూత్ర, ఇతర నమూనాలు తీసి జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ కేంద్రాలకు పంపుతారు. పంపిన 24 గంటల్లోనే రిపోర్టులు తిరిగి వారి చెంతకు చేరుతాయి. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డయాగ్నోస్టిక్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో ఇప్పటి వరకు 1,19,283 మంది రోగుల నుంచి 2,17,208 శాంపిళ్లు సేకరించి 4,10,089 పరీక్షలు చేశారు. డయాగ్నోస్టిక్ హబ్లో 10 మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఉండగా, ఒక ల్యాబ్ మేనేజర్ విధులు నిర్వహిస్తున్నారు.
పీహెచ్సీల నుంచి శాంపిళ్ల సేకరణ..
మెదక్ జిల్లాలోని 26 దవాఖానల నుంచి శాంపిళ్లను సేకరిస్తున్నారు. వాటిని తరలించడానికి ప్రత్యేకంగా నాలుగు వాహనాలను సమకూర్చారు. ఒక్కో వాహనం నిర్ణీత మార్గంలో వెళ్తుంది. కోల్డ్చైన్ బాక్సుల్లో నమూనాలను నిల్వ చేసి, మెదక్లోని డయాగ్నోస్టిక్ కేంద్రానికి తరలిస్తారు. వాటి ఫలితాలను ఆన్లైన్లో పొందుపరుస్తుంటారు. ఫలితాల వివరాలు సంబంధిత దవాఖానలకు చేరడంతో పాటు రోగుల ఫోన్లకు సమాచారం వెళ్తుంది. ఇకపోతే రేగోడ్, అల్లాదుర్గం, గడిపెద్దాపూర్, పెద్దశంకరంపేట పీహెచ్సీల నుంచి నమూనాలను సంగారెడ్డి జిల్లా వైద్య సిబ్బంది సేకరిస్తున్నారు. జిల్లాలో 20 పీహెచ్సీలు, రెండు సీహెచ్సీలు, రెండు ఏరియా దవాఖానల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. ఇదిలావుండగా జిల్లాలోని ప్రభుత్వ, పీహెచ్సీ, అర్బన్ పీహెచ్సీలలో శాంపిళ్ల సేకరణకు నాలుగు ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా దవాఖానలు కలిసేలా రూట్ మ్యాప్ తయారు చేశారు. నాలుగు వాహనాలకు రూట్లు కేటాయించారు. సేకరించిన శాంపిళ్లను జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ కేంద్రానికి తీసుకువస్తారు.
అందుబాటులోకి 134 రకాల పరీక్షలు…
తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా కార్పొరేట్ సెంటర్లకు దీటుగా 134 రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్ల ద్వారా క్లినికల్ పాథాలజీ, మైక్రోబయాలజీ, క్లినికల్ బయో కెమిస్ట్రీకి చెందిన పరీక్షలు చేస్తారు. ముఖ్యంగా బయోకెమిస్ట్రీకి చెందిన రేడియో ఏజ్, బ్లడ్ యూరియా, బ్లడ్ యూరియా నైట్రోజన్, డైరెక్ట్ ఎల్డీఎల్, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, జీజీటీ, లివిడ్ ప్రొఫైల్, ఎల్ఎఫ్టీ, పోస్ట్ లంచ్ బ్లడ్ గ్లూకోజ్, రాండమ్ బ్లడ్ షుగర్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, సీరమ్ బైలురూబిన్-డి, సీరమ్ బైలురూబిన్-టీ వంటి 36 రకాల టెస్టులు నిర్వహిస్తారు. పాథాలజీకి చెందిన అబ్సల్యూట్ ఇసినోఫిల్ కౌంట్, కంప్లిట్ బ్లడ్ పిక్చర్, కోంబ్స్ టెస్ట్ డైరెక్ట్ వంటి మొత్తం 13 రకాల పరీక్షలు చేస్తారు. ఇంకా మైక్రోబయాలజీకి చెందిన చికున్గున్యా ఐజీఎం, డెంగీ, ఆర్పీఆర్ వంటి 8 రకాల టెస్టులు చేస్తారు. ఇవన్నీ ఉచితంగా నిర్వహించడం ద్వారా బాధితులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతున్నది. రోజుల తరబడి దవాఖానల చుట్టూ తిరగకుండా 24 గంటల్లోనే టెస్ట్ ఫలితాలను ఆయా ప్రభుత్వ దవాఖానలకు, బాధితుల సెల్ఫోన్లకు సమాచారం పంపిస్తున్నారు.