పటాన్చెరు, డిసెంబర్ 22: మా ప్లాట్లను కబ్జా చేసి మళ్లీ లేఔట్ వేసి అమ్ముతున్నారని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలోని స్నేహ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగి డి.సాంబశివరావు, ఎస్.భాస్కర్రావు, కిరణ్, కె.సురేశ్ మాట్లాడుతూ రామేశ్వరంబండ గ్రామంలోని సర్వే నెంబర్ 183, 184, 221లో బ్యాంక్ వేలంలో కొన్న భూమిలో వేసిన వెంచర్లో ప్లాట్లు కొన్నామన్నారు.
1985లో 41 ఎకరాల 28 గుంటల భూమిలో ఈ ప్లాట్లు వేశారన్నారు. సాంబశివ హౌసింగ్ పేరున మూపై మూడేండ్ల క్రితం 367 ప్లాట్లను 350 గజాల చొప్పున కొన్నామని వారు తెలిపారు. సర్వే నెంబర్ 221లోని దాదాపు 150 ప్లాట్లను కొందరు రియల్టర్లు కబ్జా చేసి మరో లేఔట్ వేసి, ఇప్పుడు ఫెన్సింగ్ తీసేసి ప్రహరీ నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని సర్పంచ్కు, పాలకమండలికి, రెవెన్యూ యంత్రాంగానికి వినతి చేసినా ఫలితం లేదని వాపోయారు. జిల్లా అధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు కోరారు.