సిద్దిపేట : బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు అనేక ముళ్ల బాటను చూసిందని, పూల బాటనూ చూసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు( MLA Harish Rao) పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట కొండా మల్లయ్య గార్డెన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్(BRS) కృతజ్ఞత సభలో మాట్లాడారు. బీఆర్ఎస్కు ఉద్యమాలు, దాడులు, బెదిరింపులు కొత్తకాదని అన్నారు. నాడు పది సీట్లు వచ్చినా వెనకడుగు వేయలేదని వెల్లడించారు.
ఎన్నికల్లో అబద్దాల ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అసహనాన్ని వ్యక్తం చేస్తుందని అన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ(Loan waiver) , వడ్లకు రూ.5 వేల బోనస్ (Paddy Bonus), రూ. 4 వేల పింఛన్(Pension), కరెంట్ బిల్లుల మాఫీ వంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సెక్రటేరియట్ లో లంకె బిందెలు ఉన్నాయని వస్తే, ఖాళీ బిందెలు ఉన్నాయంటూ సీఎం రేవంత్ (CM Revanth) చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ లంకె బిందెలు ప్రభుత్వ భవనాల్లో ఉంటాయా ? లేక పాడుబడిన ఇండ్లలో ఉంటాయా? అంటూ నిలదీశారు.
‘అధికారంలో ఉన్నవాళ్లకు ఓపిక ఉండాలి. ఇచ్చిన హామీలను ఎట్లా ఎగ్గొట్టాలో కాంగ్రెస్ ఆలోచిస్తోంది. అందుకే అప్పులని, లంకె బిందెలని సాకులు చెబుతుందని’ ఆరోపించారు. ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ కంటే ముందుగానే ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 18 ఏళ్లు నిండిన మహిళలు రాష్ట్రంలో 1.50 కోట్ల మంది ఉన్నారని, వారందరికీ వెంటనే రూ. 2,500 ఇవ్వాలన్నారు.
కాళేశ్వరం(Kaleshwaram Project) ద్వారా ఒక్క ఎకరా పారడం లేదని ఆరోపించిన కొండా సురేఖ రంగనాయకసాగర్ గేట్లు ఎందుకు వదిలారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని , కాంగ్రెస్, బీజేపీలు కాదని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలను అధిక సంఖ్యలో గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు నిలదీయగలుగుతామని పేర్కొన్నారు.