జహీరాబాద్, జనవరి 6: మోతిమాత ఆశీర్వాదంతో గిరిజన తండాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రతి తండాకు రూ. 20 లక్షలు మంజూరు చేశారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం మొగుడంపల్లి మండలం ఉప్పర్పల్లితండాలో మోతిమాత జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్రావు గిరిజనులకు రాం రాం అంటూ అభివాదం చేసి ప్రసంగించారు. మీకు సమీపంలో కర్ణాటక, మహారాష్ట్ర ఉంది. అక్కడి ప్రజలు ఈ జాతరకు వచ్చారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఇస్తున్నాయా అని ఆడిగారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాల ద్వారా ఆడబిడ్డల పెండ్లిళ్లకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తున్నదన్నారు. రైతులకు ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తున్నామని, పంటలు సాగు చేసేందుకు రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ పార్టీని కర్ణాటక, మహారాష్ట్రల్లో ప్రజలు ఆశీర్వదించాలని, ఆక్కడి ఎన్నికల్లో గెలిస్తే ఇక్కడి పథకాలు అమలు చేస్తామన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు పన్నులు వేస్తున్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. జాతరకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు భారీగా రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతే మోతిమాత జాతర ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోతిమాత ఆశీర్వదంతో నాలుగు గుంటల భూమిని దేవాలయానికి ఇవ్వడం జరిగిందని, రోడ్డుతో పాటు దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలు కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు చూసి వెళ్లాలన్నారు. తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నాం, కర్ణాటకలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామన్నారు. గిరిజనులకు గతంలో 6 శాతం ఉండేదని, దాన్ని 10 శాతానికి పెంచామని గుర్తుచేశారు. ఇటీవల నిర్వహించిన ఎంబీబీఎస్ పరీక్షల్లో 240 మంది విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్తో సీట్లు వచ్చాయన్నారు. గిరిజన తండాల్లో పంచాయతీల భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతిఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలన్నారు. ఆడపిల్లలను గురుకుల పాఠశాలలో చేర్పించి చదివించాలన్నారు. అనవసరమైన ఖర్చులు చేయకుండా విద్యార్థుల చదువుకోసం ఉపయోగించాలన్నారు.
ఘనంగా మోతిమాత జాతర
మోతిమాత జాతర రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి హాజరై అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. దేవాలయం వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు మాణిక్రావు, క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ శరత్, ఆడిషనల్ కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, బీఆర్ఎస్ నాయకులు విజయ్మోహన్రెడ్డి. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.