చేర్యాల, ఫిబ్రవరి 13: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. 5వ వారానికి కరీంనగర్, మెదక్, వరంగల్ పూర్వ జిల్లాల నుంచి సుమారు 30 వేల మందికి పైగా భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం రాత్రి నుంచే మొదలైన భక్తుల రాక ఆదివా రం సాయం త్రం వరకు కొనసాగింది. భక్తులు కోనేటిలో పవిత్ర స్నా నాలు ఆచరించి క్యూలైన్ల ద్వారా స్వామివారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అర్చనలు నిర్వహించగా, మరికొందరు అభిషేకాలు చేశారు. స్వామి వారి కల్యాణోత్సవం ముగిసిన నాటి నుంచి పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ప్రతి ఆదివారం కొమురవెల్లికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతోపాటు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామిని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి దర్శించుకోగా ఆలయవర్గాలు ఘనస్వాగతం పలికాయి. అనంతరం ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల వసతి కోసం ఈవో ఎ.బాలాజీ, ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, కమిటీ డైరెక్టర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, కొంగరి గిరిధర్, పొతుగంటి కొంరెల్లి, చింతల పరశురాములు, ఆలయ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. హుస్నాబాద్ ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో చేర్యాల సీఐ శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.