గజ్వేల్ రూరల్, డిసెంబర్18: దళిత సమాజానికి తుమ్మ భూమన్న చేసిన సేవలు ఎప్పటికీ గుర్తు ఉంటాయని, దళిత సామాజిక ఉద్యమాలకు తీరనిలోటని రాష్ట్ర వైద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దాచారంలో తుమ్మ భూమన్న సంస్మరణ సభ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుంచి దళిత ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ సంఘాలను బలోపేతం చేసే దిశగా ఆయన చేసిన కృషి గొప్పదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం అమలు కోసం జగిరిన పోరాటాల్లో పాల్గొని అమలుకోసం చేసిన కృషి మరిచిపోలేనిదన్నారు. తెలంగాణ సాధనలో ఆయన అన్నివర్గాల వారిని ఏకం చేసి ఉద్యమంలో పాల్గొన్న సంఘటనలను గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన పని చేశారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, మాష్టార్జీ, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, ఎగొండస్వామి, తుమ్మ శ్రీనివాస్, చిప్పల యాదగిరి పాల్గొన్నారు.