దుబ్బాక, నవంబర్ 22 : దుబ్బాక పట్టణానికి తలమానికంగా మారిన రామసముద్రం చెరువు అధికారుల నిరక్ష్యంతో ప్రమాదకరంగా మారింది. చెరువుకట్టపై పాదచారులు నడిచివెళ్లలేకుండా ముళ్లపొదలతో ఇబ్బందికరంగా మారింది. ఇక చెరువులోకి జాలరులు, మత్స్యకారులు దిగలేకుండా గుర్రపు డెక్క విస్తరించింది. రామసముద్రం చెరువు కట్టపై నిత్యం వందలాదిమంది వాకింగ్, రన్నింగ్తోపాటు వ్యాయామాలు చేస్తుంటారు. చెరువు కట్టను రూ.3 కోట్లతో ఆధుణీకరించి మరో రూ.2 కోట్లతో సుందరీకరించారు. కొద్ది నెలలుగా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెరువుకట్టకు ఇరువైపులా ముళ్లపొదలతో ఇబ్బందికరంగా మారింది. కట్టపై పాదచారులు నడవలేని పరిస్థితి నెలకొంది. కట్టపై ముళ్ల చెట్లు ఏపుగా పెరుగడంతో ఇబ్బందికరంగా మారాయి. ఇక చెరువులో గుర్రపు డెక్క విస్తరించుకోవడంతో మరింత డేంజర్ మారింది. చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యకారులు వెళ్లలేని దుస్థితి నెలకొంది. చెరువులో సగానికిపైగా గుర్రాపు డెక్క విస్తరించడంతో సమస్యగా మారింది.
గుర్రపు డెక్కతో చేపలకు సైతం వ్యాధులు సోకే ప్రమాదం ఉందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామసముద్రం చెరువులో పర్యాటకులు విహరించేందుకు ఏర్పాటు చేసిన బోట్ల(పడవలు)ను అందులో వదిలేయడంతో పూర్తిగా పనికిరాకుండా పోయాయి. రామసముద్రం చెరువును ప్రభుత్వం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దితే అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదకరంగా మారింది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రామసముద్రం చెరువును సుందరీకరించాలని స్థానికులు కోరుతున్నారు.