ప్రశాంత్నగర్, నవంబరు 26 : చలికాలంలో ఎక్కువగా లభించే పండ్లలో సీతాఫలం ఒకటి. ఈ పండు రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. సీతాఫలం మధురమైన రుచిని కలిగి ఉంటుంది. కాలానుగుణంగా లభించే ఈ పండ్లను తినడంతో సంవత్సరమంతా ఆరోగ్యంగా ఉండవచ్చు. సీతాఫలంలో శరీరానికి అవసరమయ్యే పోషకాలతోపాటు ఔషధ గుణాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ను నశింపజేయడంలో సహాయపడతాయి. సీతాఫలాలను తినడంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వీటిని తినడంతో ఒత్తిడి తగ్గి మానసిక స్థితి మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం కూడా సీతాఫలాలకు ఉంది. సీతాఫలాలు సాధారణంగా పూర్తిగా పండిన తర్వాతనే తింటాం. రుచిగా ఉంటాయి. అయితే సీతాఫలాలు(కాయలు) వీటిని మంటల్లో కాల్చుకొని కూడా తింటారు. పూర్వకాలంలో ఎక్కువగా తినేవారు. ప్రస్తుతం వీటిని కాల్చుకొని తినవచ్చన్న సంగతి చాలా మందికి తెలియదు. మంటల్లో కాల్చిన సీతాఫలాలు కూడా చక్కటి రుచిని కలిగి ఉంటాయి. వీటిని కాల్చడం చాలా సులభం. దీనికోసం పచ్చిగా ఉన్న సీతాఫలాలను సేకరించాలి.
తర్వాత ఎండు కట్టెలను తీసుకొని కుప్పగా పేర్చి మంట పెట్టాలి. ఈ మంటల్లో సీతాఫలాలను వేయాలి. తర్వాత ఈ సీతాఫలాలపై మరికొన్ని కట్టెలను వేసి మంట బాగా వచ్చేలా చూసుకోవాలి. ఇలా కాల్చడంతో సీతాఫలం పైభాగం మాడిపోయినట్టుగా అవుతుంది. లోపల భాగం ఉడికి మెత్త బడుతుంది. సీతాఫలం మెత్తబడిన తర్వాత మంట నుంచి తీసుకొని తినొచ్చు. కాల్చడానికి అరగంట నుంచి గంట వరకు సమయం పడుతుంది. కాల్చిన కాయలను తీసుకోవడంతో శరీరంలో రోగ నిరోధకశక్తి పెరిగి వాతావరణ మార్పుల కారణంగా కలిగే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాం. యాంటీ క్యాన్సర్ లక్షణాలను కూడా సీతాఫలం కలిగి ఉంటుంది. మలబద్దకం వంటి జీర్ణసంబంధిత సమస్యలతో బాధపడే వారు సీతాఫలాలను తినడంతో సమస్య నుంచి సత్వర ఉపశమనం కలుగుతుంది. కంటి చూపును మెరుగుపర్చడం, శరీరంలో వాపులు, నొప్పులను తగ్గించడంలో కూడా ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది.