సిద్దిపేట అర్బన్, నవంబర్ 18: పోలీస్ ఉద్యోగ సాధనలో కీలకమైన దేహదారుఢ్య పరీక్షకు అభ్యర్థులు తపనతో ప్రాక్టీస్ చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ సూచించారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలో మల్టీపర్పస్ హైస్కూల్లో నిర్వహిస్తున్న ఉచిత దేహదారుఢ్య శిక్షణ కేంద్రాన్ని మంత్రి హరీశ్రావు ఆకస్మికంగా సందర్శించారు. ఉదయం పూట అందించే పాలు, గుడ్ల, పండ్ల పంపిణీ, శిక్షణ ఇస్తున్న తీరును నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. పోలీస్ కొలువు సాధించేందుకు కేసీఆర్ ఉచిత శిక్షణ కేంద్రాన్ని వినియోగించుకోవాలన్నారు. నిష్ణాతులైన పీఈటీలు క్రమం తప్పకుండా స్త్రీ, పురుష అభ్యర్థులకు సరైన శిక్షణ ఇవ్వాలన్నారు. అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ మంది అభ్యర్థులు శిక్షణకు వస్తున్నారని నిర్వాహకులు మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకురాగా, ఎంత మంది వచ్చినా ప్రతి ఒక్కరికీ గుడ్లు, పాలు, పండ్లు ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. మంత్రి హరీశ్రావు వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.