నంగునూరు, నవంబర్ 12 :సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో చోళ రాజులచే 1000 సంవత్సరాల క్రితం శంభుదేవుడి ఆలయం నిర్మించారు. ఆలయం శిథిలావస్థకు చేరడంతో దేవాలయ నిర్మాణకర్త, ప్రముఖ వేద పండితుడు బ్రహ్మశ్రీ జనమంచి సీతారామశర్మ ద్వివేది పునర్నిర్మాణానికి సంకల్పించారు. ఈ ఆలయ నిర్మాణం నిరాటంకంగా జరిగేందుకు శృంగేరి జగద్గురువులు విధుర శేఖర భారతి మహాస్వామి దివ్య ఆశీస్సులతో గ్రామంలోని శ్రీశంభుదేవుని ఆలయ ఆవరణలో చతుర్వేద పారాయణ సామూహిక కుంకుమార్చన సహిత శ్రీశతచండీ మహాయాగం ఈనెల 14 నుంచి 18 తేదీ వరకు చేపట్టాలని తలంచారు. ఈ యాగానికి ఆయా రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. శృంగేరి పీఠానికి చెందిన 50మంది వేద పండితులు తొలిసారి యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొననున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.
‘నతత్ర దేశే దుర్భిక్షం నచదు:ఖం ప్రవర్తతే.. నా కాలే మ్రియతే కశ్చిత్ పూజ్యతే యత్ర చండికా’..అంటే జగన్మాత చండీదేవి ఆరాధన ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా విరాజిల్లుతుంది. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోవని శాస్త్రం చెబుతున్నది. కలియుగంతో చండీమాత సకల దేవతా స్వరూపిణి.. కాలచక్రానికి కారణమయ్యే బ్రాహ్మీగా సుఖసంపదలతో చల్లగా కాపాడే వైష్ణవిగా.. సౌభాగ్యాలను ప్రసాదించే శాంకరిగా అమ్మవారు వేదాల్లో సుత్తించబడింది. అందుకే ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ కార్యం తలపెట్టినా నిరాటంకంగా జరిగేందుకు చేసే పవిత్ర కార్యక్రమమే చండీమహాయాగం. ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలోని శ్రీశంభుదేవుని ఆలయ ఆవరణలో చతుర్వేద పారాయణం, సామూహిక కుంకుమార్చన సహిత శ్రీశతచండీ మహాయాగం ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
రోజులు..విశేష పూజలు
గ్రామంలో ఐదు రోజుల పాటు నిర్వహించే చండీమహాయాగంలో భాగంగా తొలిరోజు సోమవారం గురువందనం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్వ మేళనం, మహాసంకల్పం, ఆచార్యాది రుత్విక్ వరణం, దేవానందీ,యాగశాల సంస్కారం, సహస్రమోదక గణపతి హవనం, గోపూజ, చండీయంత్ర స్థాపన, సప్తశతీ పారాయణం, చతుర్వేద పారాయణం, నవావరణ పూజ, సామూహిక కుంకుమార్చనలు, సువాసిని పూజ, కన్యకాపూజ, మహామంగళ హారతి, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి ప్రవచనాలు, విపంచి శశిధర్శర్మ గారి సంగీత విభావరి, నవాక్షరీ మూలమంత్ర అనుస్టానం, అష్టావధాన సేవ, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
రెండో రోజు మంగళవారం గురు, దేవతా ప్రార్థన, ఎకోత్తర వృద్ధ్దాసప్తశతీ పారాయణం, చతుర్వేద పారాయణ, సామూహిక కుంకుమార్చనలు, నవావరణ పూజ, సువాసినీ పూజ, కన్యకాపూజ, విశేషా హోమాలు, మహా మంగళహారతి, మంత్ర పుష్పం, ప్రసాద వినియోగం, సాయంత్రం చంద్రశేఖరశర్మ సిద్ధ్దాంతి ప్రవచనాలు, విపంచి లలితామతి శర్మ సంగీత విభావరీ, నవాక్షర మూలమంత్ర అనుస్టానం, అష్టావధాన సేవ, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి.
మూడోరోజు బుధవారం గురు, దేవతాప్రార్థన, ఎకోత్తర వృద్ధాసప్తశతీ పారాయణం, చతుర్వేద పారాయణ, సామూహిక కుంకుమార్చనలు, నవావరణ పూజ, సువాసిని పూజ, కన్యకాపూజ, విశేష హోమాలు,మహా మంగళహారతి, మంత్ర పుష్పం, ప్రసాద వినియోగం, సాయంత్రం మహేశ్వరశర్మ ప్రవచనాలు, విపంచి నవాక్షరీ, మూలమంత్ర అనుస్టానం, అష్టావధాన సేవ, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
నాలుగో రోజు గురువారం గురు, దేవతాప్రార్థన, ఎకోత్తర వృద్ధాసప్తశతీ పారాయణం,చతుర్వేద పారాయణ, సామూహిక కుంకుమార్చనలు, నవావరణ పూజ, సువాసినిపూజ, కన్యకాపూజ, విశేషా హోమాలు, మహా మంగళహారతి, మంత్రపుష్పం, ప్రసాద వినియోగం, సాయంత్రం కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని ప్రవచనాలు, కొడకండ్ల రాధాకృష్ణశర్మ సంగీత విభావరి, నవాక్షర మూలమంత్ర అనుస్టానం, అష్టావధాన సేవ, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయి.
ఐదో రోజు శుక్రవారం సామూహిక కుంకుమార్చనలు, చండీతర్పణం, దశాంశ హోమం, మంగళంపల్లి వేణుగోపాశర్మ వేద శాస్త్ర పండితులచే ప్రవచనం, మహా పూర్ణాహుతి, కలశ విసర్జనం, మహా మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ పూజలు జరుగుతాయి.
యాగంతో సస్యశ్యామలం..
పాలమాకులలో ఐదు రోజుల పాటు నిర్వహించే శ్రీశత చండీయాగంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం, సుభిక్షంగా మారుతుంది. అమ్మవారి అనుగ్రహంతో శంభుదేవుడి ఆలయ పునర్నిర్మానికి ఆటంకాలు లేకుండా జరిగేందుకు ఈ యాగం చేస్తున్నాం. భగవంతుడి అనుగ్రహం కోసం ఈ పవిత్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. ఐదు రోజులు భక్తులందరికీ అన్నదానం చేస్తాం.
– బ్రహ్మశ్రీ జనమంచి సీతారామశర్మ ద్వివేది, యాగ నిర్వాహకుడు, పాలమాకుల