సిద్దిపేట, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు స్వాగతిస్తున్నారు. మన రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసిన తరహాలోనే అన్ని రాష్ర్టాల్లో అంగన్వాడీ కేంద్రాలు బాగుపడతాయని వారు చెబుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడి అంగన్వాడీ కేంద్రాలకు మహర్దశ వచ్చిందని వారు పేర్కొంటున్నారు.
లక్షలాది కుటుంబాలకు భరోసా..
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండాయి. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా గర్భిణులు, బాలింతలకు ఒక్కపూట పౌష్టికాహార భోజనం పెడుతున్నారు. తీవ్ర పోషకాహారం, అతి తీవ్ర పోషకాహారం లోపం గల పిల్లలను గుర్తించడానికి ప్రతినెలా వృద్ధి పర్యవేక్షణ చేపట్టి, వారి అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. కౌమార బాలికలకు ఆరోగ్యం న్యూట్రీషియన్ కిట్ అందిస్తున్నారు. దీనిలో 10 కేజీల గోధుమలు, 500 గ్రాముల నెయ్యి, 1 కేజీ ఖర్జూరా, 750 గ్రాముల ప్రోటీన్ బిస్కట్లు, 800ఎంఎల్ ఐరన్ జింక్ సిరప్లతో పాటు మల్టీ మిటమిన్స్ టాబ్లెట్స్ 90 వరకు అందిస్తున్నారు. టీఎస్ శాట్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు పూర్వ పిరడమిక్ విద్యలో భాగంగా పిల్లల్లో క్రమానుగత ఎదుగుదల అవసరాలను తీర్చడానికి పిల్లల నైపుణ్యాలను పెంపొందించడానికి డిజిటల్ మీడియాను వినియోగిస్తున్నారు. ప్రతి గ్రామంలో పక్కా భవనాలు నిర్మించి అందులోనే చిన్నారులకు విద్యాబోధన కార్యక్రమాలను చేపడుతున్నారు. నెలనెలా తల్లులకు పిల్లలకు గుడ్లు అందిస్తున్నారు.
7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు బాలామృతం ఇస్తున్నారు. పిల్లలకు స్నాక్స్ పెడుతున్నారు. ఆకుకూరలతో భోజనం, శనివారం, గురువారం ప్రత్యేకంగా పెరుగు, పాలు అందిస్తున్నారు. ఇలా పౌష్టికాహారం అందించి తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలను దేశానికే రోల్ మోడల్గా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారు. ఇలాంటి పథకాలు, కార్యక్రమాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదు. తెలంగాణ ఏర్పడక ముందు అంగన్వాడీ కేంద్రాలను అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. టీఆర్ఎస్ అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేశారు. దీంతో మాతాశిశు సంరక్షణలో తెలంగాణ ముందున్నది. రాష్ట్రం ఏర్పడక ముందు ఒక్కో అంగన్వాడీ టీచర్ వేతనం నెలకు రూ. 2,200 ఉండే, ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఒక్కో టీచర్కు రూ.13,650 వేతనం, అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న ఆయాలకు రూ.6,500 వేతనం చెల్లిస్తున్నారు. అనేక విషయాల్లో తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఇదే విధానం కొనసాగాలంటే దేశానికి సీఎం కేసీఆర్ లాంటి నేత అవసరం. అప్పుడే దేశం బాగు పడుతుందని వారు అంగన్వాడీలు, మహిళలు ముక్తకంఠంతో చెబుతున్నారు.
అంగన్వాడీలకు మేలు చేశారు..
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ సార్ ఏ పనిచేసినా ప్రజా సంక్షేమం కోసమే చేస్తారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం, అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సరైన వేతనంతో పాటు సముచిత గౌరవం కల్పించారు. పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారు. అసంఘటిత కార్మికులకు న్యాయం జరిగింది. బీడీ కార్మికులకు సీఎం కేసీఆర్ జీవనభృతి అందించి అండగా నిలిచారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ అడుగుపెడితే భారతీయులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయి.
-మధునాల భాగ్యలక్ష్మి, రామాయంపేట
సమైక్య రాష్ట్రంలో వెట్టి చాకిరీ చేశాం
తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే అంగన్వాడీ టీచర్లకు మంచి రోజులు వచ్చాయి. సీఎం కేసీఆర్ మాకు అన్నిరకాల అవకాశాలు కల్పించారు. మాతాశిశు సంరక్షణకు ప్రభు త్వం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నది. స్వరాష్ట్రంలోనే మాకు గుర్తింపు లభించింది. సమైక్య పాలనలో చాలీచాలనీ జీతాలతో వెట్టిచాకిరీ చేశాం. తెలంగాణ వచ్చాక సంతోషంగా జీవిస్తున్నాం. సీఎం కేసీఆర్తో ప్రతి ఒక్క చిరుద్యోగికి భరోసా లభిస్తున్నది. జాతీయ రాజకీయాల్లోకి వెళితే మాలాంటి ఉద్యోగుల పాటు ఎంతో మందికి మేలు జరుగుతుందని మా నమ్మకం.
-భాగ్యలక్ష్మి, ఖాజీపల్లి, అంగన్వాడీ టీచర్, మెదక్ మండలం
అనుభవం కలిగిన నేత కేసీఆర్
దేశంపై అపార అనుభవం కలిగిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. ఆరోగ్య తెలంగాణను నిర్మించడానికి అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణులు, మాతృమూర్తులు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి నిరంతరం కృషిచేసే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం దేశ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం.
-మేఘమాల, అంగన్వాడీ టీచర్,
కొల్చారం
శుభ పరిణామం
అంగన్వాడీ టీచర్లకు మేలు చేసిన సీఎం కేసీఆర్ జాతీ య రాజకీయాల్లోకి వెళ్తే అందరికీ మంచి జరుగుతుంది. ఇప్పు డు జాతీయస్థాయిలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ టీఆర్ఎస్ సైతం జాతీయ రాజకీయ పార్టీగా రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణను అన్నిం టా ముందుకు తీసుకుపోతున్న కేసీఆర్ దేశాన్ని సైతం ముందుకు తీసుకు వెళ్తాడనే నమ్మకం మాకు ఉంది.
-మీనాక్షి, అంగన్వాడీ టీచర్, చిన్నచెల్మెడ, మునిపల్లి మండలం
టీచర్గా గుర్తించి గౌరవం ఇచ్చారు
సీఎం కేసీఆర్ జాతీ య రాజకీయాల్లోకి వస్తే దేశానికి మేలు జరుగతుంది. రూ.1500 ఉన్న జీతా న్ని రూ.13,500 లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే. అలాంటి నాయకుడు దేశానికి ప్రధాని కావాలి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశంలోని అంగన్వాడీ టీచర్లకు మేలు జరుగుతుంది. అంగన్వాడీ కార్యకర్తను టీచర్గా గుర్తించి గౌరవం ఇచ్చారు.
– కొమ్మాట మణెమ్మ అంగన్వాడీ టీచర్, నిజాంపేట