సిద్దిపేట, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదవాడి స్వప్నమైన డబుల్ బెడ్రూం ఇండ్లు. నిర్మాణాలు పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. దశలవారీగా పూర్తి చేసిన గ్రామాలు, పట్టణాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నది. లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసిన గ్రామాల్లో గృహ ప్రవేశాలను చేయిస్తున్నారు. ఇటీవల జిల్లాలో లబ్ధిదారులతో డబుల్ బెడ్రూం ఇండ్లను ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గృహప్రవేశాలు చేయించారు. పైసా ఖర్చు లేకుండా అర్హులందరికీ ఇండ్లు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు నిరుపేదలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. జిల్లాలో 15,929 ఇండ్లు మంజూరు కాగా, 12,531 ఇండ్ల పనులు ప్రారంభించి ఇప్పటి వరకు జిల్లాలో4,653 ఇండ్లను లబ్ధిదారులకు అందించారు. మరో 4,647 ఇండ్లు లబ్ధిదారులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. సిద్దిపేట నర్సపురం, గజ్వేల్ సంగాపూర్, దుబ్బాక మున్సిపాలిటీ, హుస్నాబాద్ పట్టణాలతో పాటు పలు గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను టీఆర్ఎస్ నిర్మించింది. సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకతో పాటు పక్కనే ఉన్న మధిర గ్రామాల్లో వేగంగా ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మంత్రి హరీశ్రావు ఆదేశాలతో ఆయా గ్రామాల్లో పూర్తయిన లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. తాజాగా సొంతింటి జాగ ఉన్న వారికి రూ.3లక్షల ఆర్థిక సాయం అందించేందుకు సీఎం కేసీఆర్ బడ్జెట్లో నిధులను కేటాయించారు. ఆ దిశగా నిరుపేదలు ఇండ్లు కట్టుకునేందుకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక కోటాను కేటాయించారు. ఇండ్ల నిర్మాణంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడి నిర్మాణాలు రాష్ర్టానికి ఆదర్శంగా నిలిచాయి.
జిల్లాలో రెడీగా 4,657 ఇండ్లు
జిల్లాలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో 8,424 ఇండ్లను మంజూరు చేశారు. వీటిలో దుబ్బాకకు 2,685, గజ్వేల్కు 3,114, హుస్నాబాద్కు 240, జనగామకు 145, మానకొండూరుకు 40, సిద్దిపేటకు 2200 మంజూరు అయ్యాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో దుబ్బాకకు 702, గజ్వేల్కు 839, హుస్నాబాద్కు 400, జనగామకు 240, మానకొండూరుకు 215, సిద్దిపేటకు వెయ్యి ఇండ్లు మంజూరయ్యాయి. సిద్దిపేట నర్సపురం, గజ్వేల్ సంగాపూర్, దుబ్బాక మున్సిపాలిటీల్లో మోడల్ కాలనీలను నిర్మించారు. ఇది రాష్ర్టానికి ఆదర్శంగా నిలిచాయి. సీఎం కేసీఆర్ జిల్లాకు ప్రత్యేకంగా ఇండ్లను మంజూరు చేశారు. వీటిలో దుబ్బాకకు 52, గజ్వేల్కు 56, హుస్నాబాద్కు 20, మానకొండూరుకు 122, సిద్దిపేటకు 750 ఇండ్లు మం జూరయ్యాయి. సిద్దిపేట నర్సపూర్ వద్ద నిర్మించిన మోడల్ కాలనీని సీఎం కేసీఆర్ స్వయంగా లబ్ధిదారులకు అందించారు. దీనికి కేసీఆర్ నగర్గా నామకరణం చేశారు. ఇక్కడ కాలనీని మరింతగా విస్తరించడానికి మరో వెయ్యి ఇండ్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. దీంతో పాటు సీఎం కేసీఆర్ స్వగామమైన చింతమడకతో పాటు మధిర గ్రామాలకు 1,800 ఇండ్లను మం జూరు చేయడంతో పనులు జరుగుతున్నాయి. కొన్నింటిని లబ్ధిదారులకు అందించారు. జిల్లాలో 15,929 ఇండ్లు మంజూరు కాగా, 12,531 ఇండ్లు పనులు ప్రారంభించి ఇప్పటి వరకు జిల్లాలో4,653 ఇండ్లను లబ్ధిదారులకు అందించారు. మరో 4,647 ఇండ్లు లబ్ధిదారులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపిక చురుగ్గా కొనసాగుతుంది. దశలవారీగా అం దిస్తున్నారు. మిగతా ఇండ్ల నిర్మాణాలు వివిధ దశలో ఉన్నాయి.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
జిల్లాలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను నిజమైన నిరుపేదలకు అందించేందుకు అధికార యంత్రాం గం కసరత్తు చేస్తున్నది. మున్సిపాలిటీల్లో మోడల్ కాలనీలు నిర్మాణం చేసి అన్ని వసతులను ఏర్పాటు చేసింది. విశాలమైన రహదారులు, తాగునీటి వసతి, విద్యుత్ దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర సౌకర్యాలను కల్పించింది. ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇప్పటికే గజ్వేల్, దుబ్బాక మున్సిపాలిటీల్లో దరఖాస్తులను స్వీకరించి ఎంపిక కసరత్తు ప్రారంభించారు. దుబ్బాకలో లాటరీ పద్ధతిలో అర్హులను గుర్తించారు. గ్రామాల్లో కూడా 20 నుంచి 50 వరకు ఇండ్లను నిర్మించారు. ఇండ్ల నిర్మాణాలు ఎంపికైన గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ముందుగా పరిశీలించి వారి కుటుంబ యూనిట్ ఆధారంగా పరిగణలోకి తీసుకొని గతంలో ప్రభుత్వం నుంచి ఇండ్లు తీసుకున్నారా..? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన తర్వాతనే జాబితాను రూపొందిస్తున్నారు. ఈ జాబితాను పంచాయతీ కార్యాలయం, మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నోటీస్ బోర్డులో పెడుతున్నారు. నిర్ణీత గడువులోగా ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఆ జాబితాను ఫైనల్ చేస్తున్నారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు వస్తే విచారణ చేస్తారు. విచారణ ప్రకారం తదుపరి నిర్ణయం తీసుకొని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేస్తున్నారు. ఎక్కడా కూడా రాజకీయాలకు తావులేకుండా పకడ్బందీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు.