గజ్వేల్అర్బన్, మే 28 : మల్లన్నసాగర్ భూనిర్వాసిత ఎర్రవల్లి గ్రామస్తులు శుక్రవారం ముట్రాజ్పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో సంతోషంగా గృహప్రవేశాలు నిర్వహించారు. ఆర్డీవో విజయేందర్రెడ్డి, ఎస్ఈ కనకరత్నం, డీఈలు శ్రీనివాస్రెడ్డి, ప్రభాకర్, తహసీల్దార్ రామేశ్వర్, గృహ నిర్మాణాల ఇన్చార్జి అధికారి భిక్షపతి గ్రామస్తులతో గృహప్రవేశాలు చేయించారు. గ్రామానికి 554 ఇండ్లు కేటాయించగా, శుక్రవారం 38 కుటుంబాలు సర్పంచ్ ఆకారం బాలమణి రాములు, ఉపసర్పంచ్ రాజు గౌడ్, మాజీ ఎంపీటీసీ ఎడ్ల నర్సింహులు ఆధ్వర్యంలో అధికారుల సమక్షంలో కొత్త ఇండ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులంతా కుటుంబసభ్యులు, బంధువులతో సంతోషంగా గృహ ప్రవేశాలు చేసి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మిగతా కుటుంబాలు కూడా నేడు, రేపు గృహప్రవేశాలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆర్అండ్ఆర్ కాలనీలో సంతోషంగా జీవనం..
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లిలో మల్లన్నసాగర్ భూనిర్వాసితుల కోసం నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలో ముంపుగ్రామాల ప్రజలంతా సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘట్, రాంపూర్, లక్ష్మాపూర్, సింగారం తదితర గ్రామాల కుటుంబాలకు ఇండ్లు కేటాయించారు. ఆయా గ్రామాల కుటుంబాలన్నీ గృహప్రవేశాలు పూర్తి చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. అధికారులు అన్ని మౌలిక వసతులు కల్పించడంతో ప్రజలంతా సంతోషంగా నివసిస్తున్నారు.