సిద్దిపేట టౌన్, మే 25 : లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. సడలింపు సమయానికి ముందుగానే పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. 10 గంటల వరకు అందరూ ఇండ్లలోకి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తూ లాక్డౌన్ను పక్కాగా అమలు చేస్తున్నారు. జిల్లాలో లాక్డౌన్ అమలు తీరును పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. అత్యవసర పనులపై బయటకు వచ్చే వారితో మాట్లాడి పంపించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. అనుమతి లేకుండా రోడ్లపైకి వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రతి చిన్న పనికి బయటకు వచ్చి కరోనా బారిన పడొద్దని సూచించారు. కరోనా కట్టడికి పోలీసులు నిత్యం ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారని, ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని కోరారు.
లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం..
హుస్నాబాద్, మే 25 : జిల్లాలో లాక్డౌన్ను మరింత కఠినతరం చేస్తున్నామని, ఇందుకు ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయెల్ డెవిస్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలో అమలవుతున్న లాక్డౌన్ను ఆయన పర్యవేక్షించారు. స్థానికంగా తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ ఏర్పాట్లు, పట్టణ శివారుల్లో ఏర్పాటు చేసిన పికెట్లను పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందితో మాట్లాడి అమలు తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలో ఈ నెల 12నుంచి ఇప్పటి వరకు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 448 ఈ-పీటీ కేసులు నమోదు చేశామని తెలిపారు. 21వ తేదీ నుంచి నేటి వరకు 45వాహనాలు సీజ్ చేశామన్నారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ మహేందర్, సీఐ రఘుపతిరెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.