విపత్తు సమయంలో ఆదుకుంటున్న సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన
కరోనా బాధితులకు కార్పొరేట్ స్థాయి వైద్యం
ప్రత్యేకంగా కొవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు
కొవిడ్ బాధితులకు భరోసాగా ఐసొలేషన్ వార్డు
రోగులకు నాణ్యమైన టిఫిన్, భోజనం
సిద్దిపేట జోన్, మే 15 : ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో సిద్దిపేట సర్కారు దవాఖాన ప్రాణాధారంగా మారింది. కొవిడ్ బారిన పడిన రోగులకు వైద్యంతోపాటు టిఫిన్, భోజనం అం దించి ప్రాణాలు నిలబెడుతున్నది. పరిశుభ్రతకు మారుపేరుగా నిలుస్తున్నది. వైద్యో నారాయణ హరి అనే నానుడికి నిదర్శనంగా కరోనా నియంత్రణకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సహకారంతో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల కరోనా బాధితులకు నమ్మకాన్ని, మనోధైర్యాన్ని కల్పిస్తున్నది. అనేక మందికి మంత్రి హరీశ్రావు ప్రాణదాతగా నిలుస్తున్నారు. నిత్యం ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు మంత్రి పర్యవేక్షిస్తున్నారు.
దవాఖాన అంటే బాధితులకు భరోసా, నమ్మకం
రోగులకు సదుపాయాల కల్పనతోపాటు అత్యాధునిక సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ దవాఖాన అంటే నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టారు. బాధ్యతగా ఇంట్లో తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకుంటారో కరోనా బాధితులకు భరోసానిస్తున్నది.
రోజుకు 200 మంది బాధితులకు భోజనం
కరోనా బాధితులకు మెరుగైన వైద్యంతో పాటు ఇంట్లో మాదిరిగా బాధితులకు ఉదయం టిఫిన్తోపాటు 200 మంది కరోనా పేషెంట్లకు మధ్యా హ్నం భోజనం, గుడ్డు, సాయంత్రం డ్రైప్రూట్స్, పండ్లు, రాత్రి భోజనం, గుడ్డు ఇస్తూ మనోధైర్యం కల్పిస్తూ బాధితుల ఆకలిని తీర్చుతూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు.
పరిశుభ్రంగా కొవిడ్ వార్డు
ప్రభుత్వ దవాఖాన, అందులో కొవిడ్ అనగానే దూరంగా ఉంటాం. ఆ వార్డులోని గాలికూడా ఇతర వార్డులకు వెళ్లకుండా పరిస్థితి ఉం టుంది. కానీ సిద్దిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలతో పాటు నిత్యం పరిశుభ్రతగా ఉంచుతున్నారు. దీంతో దవాఖాన ఆవరణంతా నీట్గా కనబడుతున్నది. దవాఖానలో 30 ఐసీయూ బెడ్లు, 200కు పైగా ఆక్సిజన్ బెడ్లు, 10 వెంటిలేషన్ బెడ్లు కరోనా పేషెంట్ల కోసం ఏర్పాటు చేశారు. మరో రెండు కొవిడ్ కేర్ ప్రత్యేక సెంటర్లను నైట్షెల్టర్లో ఒకటి, బాబూజగ్జీవన్రాం భవన్లో 70 ఐసొలేషన్ బెడ్లతో ప్రత్యేకంగా సెంటర్లు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం నింపుతున్నారు. రెమిడెసివర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచారు.
పాజిటివ్ గర్భిణుల డెలివరీకి ప్రత్యేక వార్డు
కరోనా పాజిటివ్తో డెలివరీ కోసం వచ్చే గర్భిణుల కోసం ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశారు. దీంతో వారికి డెలివరీ అయిన తర్వాత ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందనున్నాయి. సిద్దిపేట జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి మహిళలు కాన్పులు చేపించుకోవడం వల్ల ఇబ్బందులు చర్యలు చేపట్టారు.
కరోనా బాధితులకు వైద్యంపై ఎప్పటికప్పుడు ఆరా
సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో కరోనా బాధితులకు అందిస్తున్న వైద్యంపై మంత్రి హరీశ్రావు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీస్తున్నారు. ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. నిత్యం కరోనా పేషెంట్లకు టిఫిన్, భోజనంతో పాటు దవాఖానలో శానిటేషన్ ఫొటోలను ఎప్పటికప్పుడు గ్రూపులో పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో కరోనా బాధితులకు మంత్రి హరీశ్రావు భరోసాగా నిలుస్తున్నారు.