సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 14 : సమ సమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని, అతని స్ఫూర్తిని నేటితరం కొనసాగించాలని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. బుధవారం డా.బీఆర్. అంబేద్కర్ 130 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న రాష్ర్టాలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పింది అంబేద్కర్ అని, ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే నేడు కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా వచ్చిన రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధిలో నిలిపారన్నారు.
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల వ్యాప్తంగా అంబేద్కర్ 130 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సిద్దిపేట రూరల్ మండలం రావురూకుల, చింతమడక, పుల్లూరు, రాఘవాపూర్ గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని రంగధాంపల్లిలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు.
అంబేద్కర్ వల్లే చిన్న రాష్ర్టాల ఏర్పాటు : గద్దర్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఆలోచనల విధానంతోనే తెలంగాణ లాంటి చిన్న రాష్ర్టాలు అన్ని రంగాల్లో మిగులు బజ్జెట్ను సాధిస్తున్నాయని ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నారు. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మండలంలోని మాలపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ద్వారానే చిన్నరాష్ర్టాల ఏర్పాటుకు మార్గం సులభమైందన్నారు.
ఏడేండ్ల రాష్ట్ర ప్రగతిని చూస్తుంటే చిన్న రాష్ర్టాల ఏర్పాటు ఎంత అవసరమో గుర్తు చేస్తుందన్నారు. అంబేద్కర్ విధానాలను, ఆలోచనలను యువత పాటించినప్పుడే దేశం, రాష్ట్రం మంచి మార్గంలో ప్రయాణిస్తుందన్నారు. మిగులు కరెంట్, మిగులు జలాలు, రాష్ట్ర అభివృద్ధిని సూచిస్తున్నాయని తెలిపారు. యువత అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ, వర్గల్ ఎంపీపీ లతారమేశ్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగరాజు, మాలపల్లి అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.