అన్నిదానాలకన్నా రక్తదానం మిన్న
మూడునెలలకోసారి బ్లడ్ దానం చేయొచ్చు
రక్తదానం ఆరోగ్యానికి మేలంటున్న వైద్యులు
నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 13 : శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కృతిమ రక్తాన్ని తయారు చేసే వీలు లేకపోయింది. అవసరమైన మేరకు రక్తాన్ని సేకరించే వీలుంటుంది. చాలా మందికి శరీరంలో సరిపడా రక్తం లేక బాధపడుతూ దవాఖానలను ఆశ్రయిస్తుంటారు. ఆపదలో ఉన్న సమయంలో వారికి సరిపోయే రక్తం అందక ప్రాణాలను కోల్పోతున్నారు. అలాంటి వారికి రక్తదాన శిబిరాలు చేదోడువాదోడుగా నిలుస్తున్నాయి. రక్తదానం చేస్తే మనిషి క్షీణిస్తాడని చాలామందిలో అపోహ ఉంది. మూడు నెలలకోసారి రక్తదానం చేయడంతో శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
రక్తదానంతో ఎంతో మేలు..
రక్తదానం చేస్తే బలహీన పడుతారని చాలా మందిలో అపోహ ఉంది. కాని ప్రతి ఆరోగ్యవంతుడి శరీరంలో ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది. రక్తదానం చేసినప్పుడు కేవలం 350 మిల్లిలీటర్ల రక్తాన్ని మాత్రమే సేకరిస్తారు. దీంతో రక్తదాతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
రక్తదానం ఎవరు చేయాలి..
18 నుంచి 60 ఏండ్ల లోపు వయస్సు గలవారు 45 కిలోలు పైగా బరువున్నా ఆరోగ్యవంతులు మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చు. రక్తాన్ని సేకరించిన తర్వాత వారి బ్లడ్ గ్రూప్తో పాటు సిఫిలిస్, మలేరియా, హైపటైటిస్, ఎయిడ్స్ తదితర వైద్యపరీక్షలు నిర్వహించి దాతలకు రిపోర్టు అందజేస్తారు. శ్వాసకోశ వ్యాధి, క్యాన్సర్, గుండె జబ్బు, డయోబెటీస్, హెపటైటీస్, ఆస్తమా, ఏపిలెప్సి, లెప్రసీ, కాలేయ వ్యాధి, ఎండోక్రేన్, ఎయిడ్స్ లక్షణాలు కలిగిన వారు రక్తదానం చేయరాదు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి అస్వస్థత ఉన్నవారు ఏదైనా చికిత్సలో భాగంగా మం దులు వాడుతున్న విషయాన్ని వైద్యులకు తెలియజేస్తే వారు ఎప్పటి వరకు రక్తదానం చేయకూడదో సూచిస్తారు.
ఏ గ్రూపు వారు ఇవొచ్చు..
మానవుని శరీరంలో ఉండే రక్తం అందరిలో ఒకే రంగు ఉంటుంది. బ్లడ్ గ్రూపులను బట్టి ఒక్కో గ్రూపు వారు ఒక్కో గ్రూపు ఉన్న వారికి రక్తం దానం చేయడం లేదా తీసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా రక్తం నాలుగు గ్రూపులుగా ఉంటుంది. ఇందులో కేవలం ‘0’(ఓ) గ్రూపు మాత్రమే నెగెటివ్గా… మిగిలినవి పాజిటివ్ గ్రూపులుగా ఉన్నాయి. ‘0’నెగెటివ్ గ్రూపు వారు మిగిలిన ఏ,బీ,ఏ బీ-పాజిటివ్, నెగెటివ్ గ్రూపు వారికైనా రక్తదానం చేయవచ్చు. అందుకే ‘0’ గ్రూపు వారిని విశ్వదాతలు అంటారు.
రక్తదాతల దినోత్సవం ఏర్పడిందిలా..
కార్ల్లాండ్ స్టీనర్ బయాలజిస్ట్గా, ఫిజిషియన్గా ఎన్నో ప్రయోగాలు చేసి రక్తకణాలను వర్గీకరించారు. ఆయన 1868 జూన్ 14న ఆస్ట్రియా రాజధాని వియన్నలో జన్మించారు. 1900 సంవత్సరంలో రక్తకణాలను వర్గీకరించారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటున్నారు.
ప్రతిఒక్కరూ ముందుకు రావాలి
రక్తదానం చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలి. రక్తం ఇవ్వడంతో బలహీనతలు ఉండవు. అపోహలు పట్టించుకోవద్దు. ఇప్పటి వరకు 49 సార్లు రక్తదానం చేశా. రక్తం అందించి వారి ప్రాణాలు కాపాడడం ఆనందంగా ఉంది.
రాజశేఖర్రెడ్డి, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ
మెదక్ జిల్లా చైర్మన్