రెండు బ్యాటరీలతో రూపకల్పన
3 గంటల చార్జింగ్తో40 కిలో మీటర్ల ప్రయాణం
బ్యాటరీ మెకానిక్ మోసిన్కుప్రశంసలు
సిద్దిపేట టౌన్, జూన్ 13 : మామూలు బ్యాటరీ మెకానిక్ అద్భుతం సృష్టించాడు. పెరుగుతున్న పెట్రోలు ధరలతో తన మేథస్సుతో సైకిల్నే బైక్గా మలిచాడు. కేవలం 3 గంటల చార్జింగ్తో 40 కిలోమీటర్లు ప్రయాణించేలా రూపకల్పన చేశాడు. రెండు రోజుల వ్యవధిలోనే బైక్ను తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాకేంద్రం సాజిద్పురాకు చెందిన మహ్మద్ మోసిన్ స్థానికంగా బావీస్ ఖానాపూల్ అనే వ్యక్తి వద్ద బ్యాటరీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. రోజు ఇంటి నుంచి దుకాణం, ఇతర పనులకు బైక్ వెళ్లేందుకు రోజువారీగా వంద రూపాయల పెట్రోలు ఖర్చవుతున్నది.
బ్యాటరీ నైపుణ్యంతో మోసిన్ స్వతహాగా బైక్ను రూపొందించాలని అనుకున్నాడు. తన సైకిల్నే బైక్గా రూపొందించాలని సంకల్పించాడు. రూ.8 వేలతో రెండు బ్యాటరీలను కొనుగోలు చేసి సైకిల్ రెండు వైపులా బ్యాటరీలను అమర్చాడు. వెనుక చక్రానికి ప్రత్యేక గేర్ పరికరాన్ని తయారు చేసి అమర్చారు. బ్యాటరీ నుంచి నేరుగా పరికరానికి కనెక్షన్ ఇచ్చాడు. దాంతో గేర్ తిరగడం ప్రారంభమవుతున్నది. అదే క్రమంలో ముందు భాగం సైకిల్ వీల్కు ఎక్సలేటర్, క్లచ్, బ్రేక్, రివర్స్ గేర్ బ్యాటరీ నుంచి అనుసంధించారు. హారన్ సైతం బ్యాటరీ సిస్టమ్కు అమర్చాడు. బ్యాటరీ నుంచి వచ్చే పవర్ను అన్ని విభాగాలు పనిచేసేలా రూపకల్పన చేశాడు. లాక్, అన్లాక్ సిస్టంతో పాటు సీక్రెట్ లాక్ను తయారు చేసి అమర్చాడు. సైకిల్ బైక్పై కూర్చొని ఆన్ చేసి ఎక్సలేటర్ ఇవ్వగానే బైక్ ముందుకు కదిలేలా తయారు చేశాడు. వేగాన్ని బట్టి గేర్లు వాటంతట అవే మారే విధంగా రూపొందించాడు.
3 గంటల చార్జింగ్తో 40 కిలో మీటర్లు ..
చార్జింగ్ బైక్ను తయారు చేసేందుకు మోసిన్ రూ.8 వేలను బ్యాటరీల కోసం వెచ్చించాడు. బ్యాటరీ వైర్లు, చార్జింగ్ తెలిపే పరికరం, గేర్ సిస్టం ఇలాంటి అన్నింటికీ కలిపి రూ.10 వేలను ఖర్చు చేసి సైకిల్ బైక్ రూపొందించాడు. 3 గంటలు చార్జింగ్ పెడితే 40 కి.మీ ప్రయాణించేలా రూపొందించాడు. భవిష్యత్తులో మరిన్ని సైకిల్ బైక్లను రూపొందిస్తానని మోసిన్ ధీమాగా చెబుతున్నాడు.