సిద్దిపేట : ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించే లక్ష్యంగా విధులు నిర్వహిస్థానని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పాటిల్ను రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా కలెక్టర్గా నియమించింది.
కాగా, సోమవారం ఉదయం 10:30 గంటలకు జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు జిల్లా అదనపు కలెక్టర్లు ముజామిల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డిలు పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాటిల్ మాట్లాడుతూ.. గతంలో జిల్లా అభివృద్ధిని పరిశీలించేందుకు ఈ జిల్లాకు ఇతర జిల్లా కలెక్టర్గా వచ్చానన్నారు. అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట జిల్లాకు కలెక్టర్ గా రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు జిల్లా అభివృద్ధికి చేస్తున్న కృషిలో భాగస్వామినై వారి సహకారంతో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూస్తామన్నారు.