రామాయంపేట, ఫిబ్రవరి 3: మండలంలోని అక్కన్నపేట గ్రామంలో ఉన్న రైల్వే స్టేషన్ శివారులో ఓ వ్యక్తి గంజాయిని విక్రయిస్తుండగా, వల పన్ని పట్టుకున్నట్లు రామాయంపేట ఎక్సైజ్ సీఐ జయసుధ తెలిపారు. శుక్రవారం విశ్వసనీయ సమాచారం ప్రకారం అక్కన్నపేట రైల్వేస్టేషన్కు తమ సిబ్బందితో వెళ్లి గ్రామ శివారులో తనిఖీలు చేపట్టగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సానిపల్లికి చెందిన మంతూరి సాయిచరణ్ గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తూ, తమకు చిక్కాడని తెలిపారు. నిందితుడిని పట్టుకుని రామాయంపేట ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ చేపట్టగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి రామాయంపేట పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సాయిచరణ్ ఒప్పుకున్నాడని ఎక్సైజ్ సీఐ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 155 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో సీఐతో పాటు ఎస్సై విజయ్సిద్దార్ధ, హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, దుర్గారెడ్డి, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, కనకరాజు, స్వామి, వెంకటేశ్, రాకేశ్, రజిత ఉన్నారు.