చేర్యాల, డిసెంబర్ 9: వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామా చేశారు.శనివారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి హైదరాబాద్లోని శాసన మండలి కార్యాలయంలో రిజైన్ లెటర్ అందజేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా రెండుసార్లు గెలిపించినందుకు పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలతో పాటు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేశానన్నారు.ఇదే స్ఫూర్తితో భవిష్యత్లో నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యలతో పాటు నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడమే కాకుండా వాటి పరిష్కారానికి పోరాడుతానని తెలిపారు. గతంలో మాదిరిగానే ముందుముందు కూడా తన సహాయ సహకారాలు పట్టభద్రులకు ఉంటాయన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన గులాబీ అధినేత కేసీఆర్కు రుణపడి ఉంటానన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీ నాయకులకు ఆయన ప్రత్యేక కృతజతలు తెలిపారు. పదవీకాలంలో సహాయ సహకారాలు అందించిన మండలి చైర్మన్కు ధన్యవాదాలు తెలిపారు.
రేపు చేర్యాలలో ఎమ్మెల్యే ‘పల్లా’ పర్యటన
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సోమవారం చేర్యాలలో పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం శనివారం విలేకరులకు తెలిపారు. జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం మొదటిసారిగా పల్లా చేర్యాల పట్టణానికి వస్తున్న సందర్భంగా మండలంలోని పార్టీ ప్రజాప్రతినిధులు, గ్రామశాఖల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఉదయం 12 గంటల నుంచి ఎమ్మెల్యే పల్లా చేర్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని, సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు.