Siddipet | జగదేవ్పూర్, అక్టోబర్ 7 : సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని మునిగడప గ్రామ శివారులో ఓ వ్యవసాయ పొలం వద్ద శనివారం రాసి పోసినట్లుగా కోతుల కళేబరాలు కనిపించడంతో మండలంలో కలకలం కలిగించింది.
మునిగడప గ్రామంలోని పొలం వద్ద కోతుల మృతదేహాల గుంపును చూసి రైతు అందోళనతో సర్పంచ్ బాల్లక్ష్మీఐలయ్యకు సమాచారం ఇచ్చారు. వెంటనే సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అటవీ అధికారులు, వెటర్నరీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు కోతుల మృతదేహాలను పరిశీలించారు. కోతులు విష ఆహారం తిని చనిపోయాయా? ఎవరైనా చంపి రహదారి పక్కన వేసి, వెళ్లారా? అనేది తెలియాల్సి ఉంది. వెటర్నరీ అధికారులు కోతుల కళేబరాలను పరిశీలించి, చనిపోయిన 74 కోతులకు పోస్టుమార్టం చేశారు. మృతి కోతులను అక్కడే ఖననం చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో కోతుల మృతిపై దర్యాప్తు చేసి, కార కులపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.