సిద్దిపేట, జనవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్లోకి నీటిని పంపింగ్ చేసి యాసంగి పంటలకు అందించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం హరీశ్రావు ఫోన్లో మంత్రి ఉత్తమ్కు సిద్దిపేట రైతుల పరిస్థితులను వివరించారు. నీటి లభ్యత ఉన్న మిడ్మానేరు లేదా అనంతగిరి రిజర్వాయర్ నుంచి 1.50 టీఎంసీల నీటిని వెంటనే పంపింగ్ చేయాలని కోరారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని హరీశ్రావు కలిసి రంగనాయకసాగర్లోకి నీటిని విడుదల చేయాలని లేఖ అందించారు. సుమారు 55వేల ఎకరాలకు నీళ్లు లేక రైతాంగం ఆందోళన చెందుతున్న విషయాన్ని మంత్రికి వివరించారు. మూడేండ్లుగా జిల్లా సాగు భూములకు రంగనాయక సాగర్ ద్వారా నీరు అందజేశామని, దీనివల్ల బంగారు పంటలు పండి రైతుల బతుకుల్లో సంతోషం నిండిందని హరీశ్రావు పేర్కొన్నారు.
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటలకు సరిపోయే నీరు రిజర్వాయర్లో లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. యాసంగి పంటలకు నీళ్లు అందించాలంటే 3టీఎంసీల నీరు ఉండాలని, కానీ.. ప్రస్తుతం రంగనాయక సాగర్ రిజర్వాయర్లో 1.50 టీఎంసీల నీరు మాత్రమే ఉందన్నారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని నీరివ్వాలని కోరారు.
రంగనాయకసాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీటిని లిఫ్ట్ చేసేలా అధికారులను తక్షణమే ఆదేశించాలని కోరారు. మల్లన్నసాగర్ ఆయకట్టు రైతులకు సైతం నీళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సానుకూలంగా స్పందించి ఇరిగేషన్ అధికారులతో చర్చించి నీటి పంపింగ్కు ఆదేశాలిస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.