సిద్దిపేట : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణలో ఉందన్నారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు.
ఈ తొమ్మిది రోజుల పాటు తీరొక్క పువ్వులతో బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకున్న ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువుల వద్ద ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ, చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని గుర్తు చేశారు. బతుకమ్మ పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.